అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ నిర్వహించిన కొత్త అధ్యయనం ఒక ఆందోళన కలిగించే విషయాన్ని వెల్లడించింది. టీనేజ్ దశ నుంచే అధిక బరువుతో బాధపడుతున్న మహిళలకు 55 ఏళ్లలోపే పక్షవాతం రావడానికి గణనీయమైన ప్రమాదం ఉందని తేలింది. ఈ పరిశోధనలో లక్షలాది మంది మహిళల ఆరోగ్య డేటాను పరిశీలించారు. ఫలితాలు స్పష్టంగా చూపిన ఒక విషయం – ఊబకాయం ఎప్పుడు మొదలైంది అనేది కూడా పక్షవాతం రిస్క్ను నిర్ణయిస్తుందని.
ఎప్పుడూ సన్నగా ఉండి, ఎప్పుడూ ఊబకాయం లేని మహిళలతో పోల్చితే.. కనీసం ఒక్క దశలోనైనా ఊబకాయం ఉన్నవారిలో పక్షవాతం ముందుగానే వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అధ్యయనం స్పష్టం చేసింది. ముఖ్యంగా టీనేజ్ లేదా 20–30 ఏళ్ల వయసులోనే బరువు అదుపు తప్పితే, ఆ ప్రభావం దశాబ్దాల పాటు శరీరంలో నిలిచి రక్తనాళాలను దెబ్బతీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంటే చిన్న వయసులోనే బరువు పెరిగితే అది కేవలం “లుక్స్” సమస్య మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాధులకు ఆహ్వానం పలుకుతుందన్నమాట.
అంతేకాదు, ఈ ఊబకాయం ఒక్క పక్షవాతం రిస్క్ను మాత్రమే కాకుండా.. డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండె జబ్బులు వంటి ఇతర జీవనశైలి వ్యాధులను కూడా వేగంగా ఆహ్వానిస్తుంది. ఒకసారి ఈ సమస్యలు మొదలైతే అవి ఒకదానికొకటి గొలుసు లాగా అనుసంధానమై పక్షవాతం రావడాన్ని మరింత సులువు చేస్తాయి. అందుకే చిన్న వయసులోనే బరువును అదుపులో ఉంచుకోవడం ఎంతో కీలకం.
ఈ అధ్యయనం మనకు ఇచ్చిన సందేశం స్పష్టం – ఊబకాయాన్ని “పెద్దవాళ్ల సమస్య” అని కొట్టిపారేయడం పొరపాటు. టీనేజ్ నుంచే ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ అలవాటు చేసుకుంటే.. 50–55 ఏళ్లలోపు పక్షవాతం లాంటి భయానక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఇప్పటి నుంచే మొదలుపెట్టండి.. మీ భవిష్యత్తు ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa