ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలు, వినతులపై వేగంగా స్పందించడమే కాకుండా.. వాటి సత్వర పరిష్కారానికి నారా లోకేష్ చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నారా లోకేష్ ఆదేశాలతో పోలీసులు వేగంగా స్పందించి.. తప్పిపోయిన మహిళను ఆమె కుటుంబం వద్దకు చేర్చారు. దీంతో కథ సుఖాంతం కాగా.. నారా లోకేష్ పోలీసులు ధన్యవాదాలు తెలియజేశారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వస్తే.. తన క్లోజ్ ఫ్రెండ్ అమ్మ తప్పిపోయిందని, కనిపెట్టి సాయం చేయాలంటూ ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. విజయవాడలో రెండు రోజుల కిందట ఆమె తప్పిపోయిందంటూ అందులో రాసుకొచ్చారు. ఈ విషయం నారా లోకేష్ దృష్టికి రాగా.. నారా లోకేష్ వెంటనే విజయవాడ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో అలర్ట్ అయిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు గంటల వ్యవధిలోనే ఆ మహిళ ఆచూకీని గుర్తించారు. ఆమె కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారు.
"గౌరవనీయులైన సర్.. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కొన్ని గంటల్లోనే తప్పిపోయిన మహిళను కనుగొన్నారు, ఆందోళన చెందుతున్న ఆ కుటుంబానికి ఉపశమనం కలిగించారు. వారి బాధను అర్థం చేసుకుని, ఈ సమస్యను గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, ప్రజా సేవకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాము." అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు నారా లోకేష్ థ్యాంక్యూ వెరీ మచ్ విజయవాడ పోలీస్ అంటూ రిప్లై ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు ఎస్పీ రాజశేఖర్ బాబు పలు కీలక సూచనలు చేశారు. మీ కుటుంబ సభ్యులు ఎవ్వరైనా తప్పిపోయినా, లేదా ఇంటి నుంచి వెళ్లిపోయినా వెంటనే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధులలో10,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. మిస్సింగ్ అయిన గంటలో ఫిర్యాదు చేసినట్లయితే, నగరంలో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా వారి కదలికలను త్వరితగతిన గుర్తించడం జరుగుతుందని అన్నారు. ఫిర్యాదులో ఆలస్యం జరిగితే, వారి కదలికలను గుర్తించడంలో కూడా ఆలస్యం జరుగుతుందని సూచించారు. మరోవైపు విజయవాడ నగరంలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు అమర్చామని.. మిస్సింగ్ వ్యక్తుల ఫోటోలు , వాహన నెంబర్ల ఆధారంగా గుర్తిస్తామని ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa