భర్త ఆర్మీలో ఉద్యోగి. సమాజం గౌరవించే స్థాయి. కానీ ఆయన భార్య పక్కదారి పట్టింది. ఓ యువకునితో సంబంధం ఏర్పరుచుకుంది. చివరికి ఆ సంబంధమే ఆమె ప్రాణాన్ని తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన గద్దె నాగమణికి 16 సంవత్సరాల క్రితం ఆర్మీలో పని చేసే రమేష్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఉన్నంతలో వీరి జీవితం హాయిగా సాగుతుంది. 6 నెలలకు ఒకసారి రమేష్ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు.
నాగమణి ఇంటి పక్కనే గతంలో కంచిపల్లె పంచాయతీ రాజుపేట గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే యువకుడు అద్దెకు ఉండేవాడు. భర్త ఆర్మీలో ఉండటంతో నాగమణి అతడి ఆకర్షణలో పడింది. పిల్లలను కూడా పట్టించుకోకుండా కోటేశ్వరరావుతో చనువుగా ఉంటుండేది. దీంతో పద్ధతి మార్చుకోవాలని నాగమణిని తల్లిదండ్రులు మందలించారు. ఆ తర్వాత కోటేశ్వరావు కూడా ఆ ఇంటికి ఖాళీ చేసి వేరే చోటికి వెళ్లిపోయాడు.
నాగమణికి పొదలకుంటపల్లో సచివాలయంలో సోషల్ వెల్ఫేర్ సహాయకురాలిగా ఉద్యోగం వచ్చింది. రోజూ గిద్దలూరు నుంచి పొదలకుంటపల్లెకు వెళ్లి వచ్చేది. రమేష్ 6 నెలల క్రితం ఆర్మీ నుంచి వచ్చాడు. విషయం రమేష్ కు తెలియకపోవడంతో అంతా సవ్యంగానే ఉంది. శుక్రవారం నాగమణి డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన రమేష్ నాగమణి తండ్రి వెంకటేశ్వర్లుకు విషయం చెప్పి అంతా వెతికారు. కానీ ఆమె ఆచూకీ తెలియలేదు.
శనివారం ఉదయం 3 గంటల సమయంలో పోలీసులు నాగమణి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. నాగమణి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని చెప్పారు. దీంతో వారు అక్కడకు చేరుకొని షాకయ్యారు. నాగమణిని ప్రియుడు కోటేశ్వరరావే హత్య చేసి ఉండవచ్చని తండ్రి వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న రమేష్ తన భార్య నిర్వాకం తెలిసి షాకయ్యాడు.
నాగమణిని శుక్రవారం అర్ధరాత్రి రాజుపేట గ్రామం నుంచి ఆటోలో తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించారనే వదంతులు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేసేందుకు ప్రయత్నించి చివరి నిమిషంలో హాస్పిటల్కు తీసుకొచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa