ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్

national |  Suryaa Desk  | Published : Thu, Feb 11, 2021, 02:35 PM

ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ఓటమి బాధలో ఉన్న భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడ్డ జడేజా.. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు అతను తదుపరి టెస్ట్ మ్యాచ్‌లతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా దూరం కానున్నాడు. ఆసీస్ పర్యటనలోని సిడ్నీ టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తుండగా జడేజా బొటన వేలు విరిగిన విషయం తెలిసిందే.


దాంతో తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన జడ్డూ.. చివరి రెండు టెస్ట్‌లకు అందుబాటులో ఉంటాడని అభిమానులు భావించారు. కానీ అతని గాయం మానడానికి ఎక్కువ సమయం పడుతుందని, సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని జట్టు వర్గాలు తెలిపాయి. అతని గాయం తీవ్రత దృష్ట్యా వన్డేలు, టీ20ల్లోనూ ఆడేది కూడా అనుమానంగా మారిందన్నారు. జడేజా ప్రస్తుతం బెంగళూరు ఎన్‌సీఏ‌లో చికిత్స తీసుకుంటున్నాడు.


ఇక ఆస్ట్రేలియా పర్యటనలో జడేజా పలుమార్లు గాయపడిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్ సందర్భంగా తొడ కండరాల గాయంతో పాటు కంకషన్‌కు గురయ్యాడు. ఆ తర్వాత మెల్‌బోర్న్ టెస్ట్‌తో జట్టులోకి వచ్చి సిడ్నీ టెస్ట్‌లో మళ్లీ గాయపడ్డాడు. దాంతో జట్టుకు దూరమయ్యాడు. అతని గైర్హాజరీ నేపథ్యంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అవకాశం దక్కించుకున్నారు. తొలి టెస్ట్‌లో సుందర్, నదీమ్ బరిలోకి దిగగా.. ఆశించిన మేర రాణించలేకపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa