ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 01, 2021, 09:47 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. గత కొద్ది రోజుల క్రితం ఎస్వీ ప్రసాద్ కుటుంబం కరోనా బారిన పడింది. దీంతో ఆయన, కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రిలో చేరారు. అయితే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే.. ఆయన పరిస్థితి విషమించి మృతిచెందారు. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఎస్వీ ప్రసాద్ 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్వీ ప్రసాద్ సీఎస్‌గా పనిచేశారు. తన కంటే 20 మంది సీనియర్ అధికారులున్నా.. ఎస్వీ ప్రసాద్‌నే సీఎస్ పోస్టు వరించడం గమనార్హం. 


నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్వీ ప్రసాద్ సీఎస్‌గా పనిచేశారు. పదేళ్లకుపైగా ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్ విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్‌గానూ ఎస్వీ ప్రసాద్ పనిచేశారు. నిబద్ధత కలిగిన ఉన్నతాధికారిగా ఎస్వీ ప్రసాద్ గుర్తింపు పొందారు. నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్‌గా ఎస్వీ ప్రసాద్ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 1982లో కడప, 1985లో విశాఖపట్నం జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఛైర్మన్, కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు. ప్రసాద్ మరణం పట్ల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa