ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయసాయిరెడ్డి ప్రజాదర్బార్ కు వినతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 09:28 AM

సీతమ్మధారలోని తన కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బుధవారం ఏర్పాటుచేసిన ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రజాదర్బార్‌ సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగింది. మొదటిగా వచ్చిన వారికి కార్యాలయ సిబ్బంది టోకెన్లు అందజేశారు. విసిటిపిఎల్‌ ఇచ్చిన హామీని అమలుచేయలేదని మత్స్యకార సంక్షేమ సంఘ నాయకులు వినతిపత్రం అందించారు. కొత్తగా నిర్మిస్తున్న జెట్టిలోనైనా తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. మధురవాడ కొమ్మాది -2లో ఎస్సీ కమిషన్‌ ద్వారా వచ్చిన గృహాల్లో 29 ఇళ్లకు కరెంటు, తాగు నీరు సదుపాయాలు కేటాయించలేదని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి పిల్లి వీర్రాజు, మహిళా సంఘం ప్రతినిధి రాధ వినతిపత్రం అందించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని చేతి పంపు మెకానిక్‌లు, పలువురు కాంట్రాక్టు కార్మికులు వినతులు అందజేశారు. స్థల ఆక్రమణపై వికలాంగుడు, పెండింగు బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, అగనంపూడి టోల్‌గేటుపై వైసిపి కార్పొరేటర్‌ భూపతి రాజు సుజాత ఫిర్యాదులు అందజేశారు. ఘోషాసుపత్రిలో సదుపాయాలు కల్పించాలని మాజీ కార్పొరేటర్‌ బిఎస్‌ ఉమామహేశ్వరరావు వినతి అందజేశారు. పర్మినెంట్‌ చేయించాలని నేవల్‌ డాక్‌యార్డు, విశాఖ డెయిరీలో చేస్తున్న కార్మికులు వినతులు అందించారు. రుషి కొండ వద్ద తొలగించిన షాపులను పునరుద్ధరించాలని వాటి యజమానులు విజ్ఞప్తి చేశారు. ఎంవిపి కాలనీలో దివ్యాంగుల ఆశ్రమం లీజు పొడిగింపునకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు వినతి పత్రం అందించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు వినతులు అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa