ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తపై పట్టరాని కోపంతో భార్య ఎం చేసిందంటే..?

international |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 05:01 PM

సంసారం అన్నాక భార్యాభర్తలు మధ్య గొడవలు సహజమే. ఒకరి విషయంలో మరొకరు సర్దుకుపోతేనే కాపురం సజావుగా సాగుతుంది. అయితే కొంత మంది చిన్న చిన్న విషయాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆలూమగల గొడవలు కొన్ని నవ్వు రప్పిస్తే, మరికొన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. మీకు జగపతిబాబు, ఆమని, రోజాలు నటించిన శుభలగ్నం సినిమా గుర్తు ఉండే ఉంటుంది. అందులో జగపతిబాబును రూ.కోటికి అమ్మేస్తుంది రోజా. అదే సన్నివేశాన్ని తలపిస్తూ నిజజీవితంలోనూ ఓ మహిళ తన పతిదేవుడిని అమ్మకానికి పెట్టింది. దీనికి కారణం తెలుసుకుంటే మాత్రం మీరు నవ్వాపుకోలేరు.

ఐర్లాండ్‌కు చెందిన లిండా మెక్ అలిస్టర్ తన భర్త జాన్ మెక్ అలిస్టర్‌, ఇద్దరు పిల్లలతో కలిసి న్యూజిలాండ్‌లో నివసిస్తోంది. ఇటీవల ఆమెకు ఓ విషయంలో భర్తపై పట్టరాని కోపం వచ్చింది. తనను, పిల్లలను తీసుకెళ్లకుండా ఆమె భర్త జాన్‌ ఒక్కడే చేపలు పట్టేందుకు విహారయాత్రకు వెళ్లడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. తన భర్త వివరాలను పేర్కొంటూ న్యూజిలాండ్‌లోని ప్రముఖ e-bay స్టైల్‌ సైట్‌ అయిన Trade Me అనే వేలం సైటులో అమ్మకానికి పెట్టింది. తన భర్త ఎత్తు, బరువు, వృత్తి వివరాలతో కూడిన ఫొటోను అప్‌లోడ్ చేసింది. సన్నిహితుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న భర్త జాన్ అవాక్కయ్యాడు. తరువాత నవ్వేశాడు. తన భార్యతో అన్యోన్య దాంపత్యం ఉందని, సమస్య సర్దుకుంటుందని అన్నాడు.

ఇదిలా ఉండగా ఆమె ప్రకటనను చూసిన నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అయితే ఆ ప్రకటన నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెబుతూ సదరు వెబ్‌సైట్ దానిని తొలగించింది. అప్పటికే జాన్‌ను కొనుక్కునేందుకు కొందరు పెద్ద ఎత్తున బిడ్డింగ్ మొదలు పెట్టడం కొసమెరుపు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa