రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం తప్పదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని తమ దేశ పౌరులంతా వెంటనే స్వదేశం తిరిగి రావాలని అమెరికా సూచనలు చేసింది. ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంతో యుద్ధం జరిగే ముప్పు పొంచి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపపథ్యంలో ఎక్కువ సమయం లేదని, వీలైనంత త్వరగా బయల్దేరాల్సిందేనని తమ పౌరులకు తెలిపింది. ఉక్రెయిన్ పై రష్యా ఈ వారంలోనే దండయాత్ర చేస్తుందని అమెరికా పేర్కొంది. అంతేగాక, 48 గంటల్లోనే రష్యా సైన్యం ఉక్రెయిన్పై ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ చెప్పారు. చైనాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ ముగిసేలోపు దాడి జరిగే ముప్పు ఉందని ఆయన తెలిపారు. ఈ మేరకు తమ సైన్యానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారని తాము చెప్పడం లేదని, అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించి ఈ సూచనలు చేస్తున్నామని తెలిపింది. ఆక్రమణలు మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ఒకవేళ వైమానిక దాడులు మొదలైతే ఆ సమయంలో ఉక్రెయిన్ నుంచి వెళ్లడం కష్టంగా మారుతుందని హెచ్చరించారు. అక్కడి తమ పౌరుల జీవితాలు ప్రమాదంలో పడుతాయని చెప్పారు. అయితే, అమెరికా ఆరోపణలను రష్యా మాత్రం కొట్టిపారేస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దు వద్ద రష్యా ఇప్పటికే సుమారు లక్ష మంది దళాలను మోహరించింది. ఉక్రెయిన్ వదిలి వచ్చేయాలని ఇప్పటికే బ్రిటన్, కెనడా, నెదర్లాండ్స్, లత్వియా, జపాన్, దక్షిణ కొరియాలు కూడా తమ పౌరులకు సూచించాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కియివ్ లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. అలాగే, తూర్పు ఐరోపాలో అమెరికా బలగాల సంఖ్య 6,000కు చేరనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa