ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 09:12 AM

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల సేవల్లో నాణ్యత పెంచేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎరువులు, సబ్సిడీ, నాన్‌సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు, దాణా, రొయ్యలు, చేపల మేత చెల్లింపుల్లో డిజిటల్‌ లావాదేవీలను ప్రారంభిస్తోంది. డిజిటల్‌ చెల్లింపుల విధానం వల్ల సరుకు పంపడంలో జాప్యం, ఆర్బీకేల్లో అవకతవకలకు ఆస్కారం లేని రీతిలో పారదర్శకంగా పంపిణీ చేయొచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది.


రానున్న ఖరీఫ్‌ నుంచి సబ్సిడీతో పాటు కనీసం 10 శాతం నాన్‌ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులకు శ్రీకారం చుడుతోంది. ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి వాలెట్స్‌ ద్వారా నేరుగా సంస్థ ఖాతాకు డబ్బులు జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంకుతో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు ప్రతి ఆర్బీకేకు ఓ క్యూ ఆర్‌ కోడ్‌ ఇస్తారు. చెల్లింపులు బయటకు విన్పించేలా ఓ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ సిస్టమ్‌ను అందిస్తారు. రైతులు వారికి అవసరమైన వాటిని బుక్‌ చేసుకొనే సమయంలో తగిన సొమ్మును స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి చెల్లించాలి. వెంటనే వారికి విత్తనాలను అందిస్తారు.


చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు రైతుల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా డిజిటల్‌ చెల్లింపులకు శ్రీకారం చుడుతున్నట్లు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు తెలిపారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌ నుంచి డిజిటల్‌ చెల్లింపులతోనే ఆర్బీకేల ద్వారా జరిగే విత్తన విక్రయాలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa