తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో.. పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. అడిషనల్ ఎస్పీలైన భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో అందరికంటే ముందుగా అరెస్టయిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు.. మొదట విచారణకు సహకరించపోయినప్పటికీ.. తర్వాత మెల్లిగా వివరాలు వెల్లడించారని పోలీసులు వివరించారు. హార్డ్ డిస్కులను డిసెంబరు 4న మూసీలో పడేసినట్లు ప్రణీత్ రావు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. నాగోలు వద్ద మూసీలో హార్డ్ డిస్క్ ముక్కలను పడేసినట్టు ప్రణీత్ రావు వెల్లడించగా.. అతన్ని తీసుకెళ్లి మరీ వాటి శకలాలు వెలికి తీసినట్టుగా తెలిపారు.
ఇక.. మూసీలో 5 ధ్వంసమైన హార్డ్ డిస్కులతో పాటు మెషీన్తో కట్ చేసిన 9 హార్డ్ డిస్క్ ముక్కలను, 6 మెటల్ హార్డ్ డిస్కుల ముక్కలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రణీత్ రావు చెప్పిన సమాచారంతో ఎస్ఐబీ కార్యాలయంలోనూ పలు ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఎస్ఐబీ కార్యాలయంలో 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్ టాప్, మానిటర్, పవర్ కేబుళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రీషియన్ గదిలోనూ ముక్కలైన హార్డ్ డిస్క్ పొడిని పోలీసులు సేకరించారు. ఎస్ఐబీ కార్యాలయం ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఎస్ఐబీ కార్యాలయం సీసీ ఫుటేజి లాగ్ బుక్ ప్రతులు కూడా సేకరించినట్టు సమాచారం.
మరోవైపు.. ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ వాంగ్మూలం నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బీఆర్ఎసేతర అభ్యర్థుల డబ్బుల పంపిణీపై తాము నిఘా పెట్టినట్లు ఎస్ఐబీ కానిస్టేబుల్ వాంగ్మూలం ఇచ్చినట్టు సమచారం. భుజంగరావు, తిరుపతన్న స్వయంగా నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ నివేదికలో వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా పెట్టడంలో భుజంగరావు, తిరుపతన్న కుట్ర ఉన్నట్లు రిమాండ్ నివేదికలో పోలీసుల వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa