రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గురువారం వడగాలలకు నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. గురువారం తెలంగాణవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. ఇందులో 14 ప్రాంతాల్లో 43 డిగ్రీల సెల్సియస్ దాటేయడం ఎండల తీవ్రతకు అద్దంపడుతోంది. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాదే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చివరిగా 2016లో ఈస్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక, మరో రెండు రోజుల పాటు తీవ్రత ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది, శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.
అంతేకాదు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీవ్రత అధికంగా ఉంటుందని.. ఈ సమయంలో వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని వాతావరణ నిపుణులు సూచించారు. గురువారం నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5 డిగ్రీలు, కనగల్లో 43.4 డిగ్రీలు, బుగ్గబావిగూడ 43.2, నాంపల్లి, నిడమనూరు, కట్టంగూరులో 43 డిగ్రీలు, టిక్యా తండాలో 42.9 డిగ్రీలు, డిండి (గుండ్లపల్లి)లో 42.8 డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదయినట్టు అధికారులు తెలిపారు.
ఆ తర్వాత గద్వాల జిల్లా వడ్డేపల్లి, ధరూర్, ద్యాగదొడ్డి, తిమ్మనదొడ్డి, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్, వంకులం, ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (సబ్ కలెక్టర్ ఆఫీస్), పినపాక మండలం బయ్యారంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని డొంకల్ గ్రామానికి చెందిన రమావత్ అఖిల్(4) వడదెబ్బతో మృతి చెందాడు. రమేశ్, అనిత దంపతుల కుమారుడైన అఖిల్ గురువారం బడికి వెళ్లివచ్చిన తర్వాత ఎండలో ఆడుకున్నాడు. పొలం పనులకు వెళ్లిన తిరిగొచ్చిన అనిత.. కుమారుడు జ్వరం, వాంతులతో బాధపడుతుండటం గమనించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే పరిస్థితి విషమించి, బాలుడు వడదెబ్బతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa