ఏం తిందామన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్ననే.. ఓ ప్రముఖ కంపెనీ చాక్లెట్లో సజీవంగా ఉన్న పురుగు వచ్చిన ఘటన మరువక ముందే.. మరో ఘనట వెలుగులోకి వచ్చింది. అది కూడా హైదారాబాద్లోని ఓ పేరున్న బేకరీ నుంచి కొన్న ఫుడ్ ఐటెం కావటం.. ఇప్పుడు నగరవాసులను ఆలోపించజేస్తోంది. అయితే.. ఏప్రిల్ 5వ తేదీన సాయంత్రం ఓ కస్టమర్.. ఉప్పల్లో ఉన్న పిస్తా హౌస్ బేకరీలో బనానా కేక్ కొనుగోలు చేశాడు. కాగా.. శనివారం (ఏప్రిల్ 6న) ఉదయం తిందామని బాక్స్ ఓపెన్ చేసి చూస్తే.. ఘోరం. కేకు ముక్కలు మొత్తం నల్లట్టి బూజు (ఫంగస్) పట్టి కనిపించాయి. అలా అని కేసు ఎక్స్పైర్ అయిపోయిందా అంటే.. ఎక్స్పైరీ డేట్ ఏప్రిల్ 10వ తారీఖుగా ఉంది. నాలుగో తేదీన తయారు చేసినట్టుగా ఆ బాక్సు మీద రాసి ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కస్టమర్.. ట్వీట్ చేశాడు.
"అందరూ అప్రమత్తంగా ఉండండి.. నిన్న పిస్తా హౌస్లో బనానా కేక్ కొని.. ఉదయం తిందామని ఓపెన్ చేస్తే.. తినడానికి ఏమాత్రమూ ఆమోదయోగ్యంగా లేకుండా ఉంది. దానిపై ఏప్రిల్ 10వ తేదీవరకు వ్యాలిడిటీ ఉంది. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అనేది ఓ పెద్ద జోక్గా మారింది. అదికూడా పేరు మోసిన పిస్తా హౌస్ లాంటి బేకరీల్లో." అంటూ కస్టమర్ ట్వీట్ చేశారు. ఫిస్తా హౌస్ యాజమాన్యానికి, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశాడు. కాగా.. కస్టమర్కు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. తమకు కూడా చాలా సార్లు ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఎదురయ్యాయంటూ చెప్పుకొచ్చారు. సాధారణంగా చిన్న చిన్న బేకరీల్లో అయితే.. ఇలా ఎప్పుడో తయారు చేసి.. ఇంకెప్పుడో అమ్ముతుంటారనుకోవచ్చు... కానీ హైదరాబాద్లోనే పేరు మోసిన పిస్తా హౌస్ లాంటి ఓ బేకరీలో ఇలా జరగటం.. అది కూడా రంజాన్ మాసం నడుస్తున్న సమయంలో జరగటం.. కస్టమర్లను ఆలోచింపజేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa