ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత బస్సు పథకం ఎఫెక్ట్..అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 07:21 PM

హైదరాబాద్ మెట్రో అమ్మేందుకు ఎల్ అండ్ టీ సంస్థ సిద్దమైంది. సంస్థకు వస్తున్న నష్టాలతో హైదరాబాద్ మెట్రోను విక్రయించేందుకు సిద్ధమైంది. అయితే.. ఈ అమ్మకం తక్షణమే కాదండోయ్.. 2026 తర్వాత విక్రయించాలని అనుకుంటున్నట్లు ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ స్పష్టం చేశారు. సాధారణంగా అయితే.. 65 ఏళ్ల వరకు సంస్థను విక్రయించేందుకు వీలులేదన్న శంకర్.. ఎల్ అండ్ టీకి ప్రస్తుతం వస్తోన్న నష్టాల నేపథ్యంలో మెట్రో అమ్మకానికి వెసులుబాటు కల్పించాలని సర్కారును శంకర్ అభ్యర్థించారు. ఎల్ అండ్ టీ సంస్థకు గణనీయమైన నష్టాలు వస్తుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా వెల్లడించారు.


అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల.. హైదరాబాద్ మెట్రోకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని శంకర్ వివరించారు. ఈ పథకం వల్ల మహిళలంతా బస్సును ఆశ్రయిస్తుండగా.. కేవలం పురుషులే మెట్రోలో ప్రయనిస్తున్నారని చెప్పుకొచ్చారు. మహాలక్ష్మి పథకంతో పాటు.. ఊబర్ , ఓలా, రాపిడో వంటి సంస్థ సేవలు కూడా పెరిగిపోవటంతో.. మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య చాలా వరకు తగ్గిందని శంకర్ తెలిపారు. సంస్థకు వస్తోన్న లోటును పూడ్చుకునేందుకు చర్యలు చేపట్టినా.. ఫలితాన్ని ఇవ్వకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.


"ఫ్రీ బస్సు వల్ల మహిళలు అంత బస్సులో ప్రయాణిస్తున్నారు.. బస్సుల సంఖ్య పెంచక పోవటం వల్ల బస్సులో వెళ్లవల్సిన పురుషులు అందరూ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు.. దీని వల్ల మెట్రో ప్రయాణికుల సంఖ్య అంత ఆసక్తికరంగా లేదు. బస్సులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మెయింటేనెన్స్ చేయాల్సి వస్తుంది. ఇలా ఫ్రీగా ప్రయాణిస్తున్నప్పుడు బస్సుల మెయింటేనెన్స్‌కు డబ్బులు ఎక్కడ నుండి తీసుకు వస్తారు. రాజకీయ పార్టీ హామీల కోసం పెట్టిన ఈ స్కీం తెలంగాణ రవాణా సంస్థని అప్పుల పాలు చేస్తుంది." - శంకర్ రమణ, ఎల్ అండ్ టీ సీఎఫ్ఓ.


2023-24 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో సంస్థకు వచ్చిన నష్టాలను యాజమాన్యం నివేదించింది. ఎల్ అండ్ టీ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. 2023లో రోజుకు సగటు ప్రయాణికుల సంఖ్య 4.08 లక్షల మందిగా ఉండగా.. 2024లో ఆ సంఖ్య 4.41 లక్షల మందికి చేరింది. కాగా.. ప్రస్తుతం మెట్రోకు వస్తున్న నష్టాలను పూరించాలంటే 4.8 లక్షల మంది ప్రయాణించాలని అంచనా వేస్తున్నట్టు సంస్థ యాజమాన్యం తెలిపింది. అయితే.. ఈ ఆర్థిక నివేదిక ఆధారంగా మునుపటి త్రైమాసికంతో పోల్చితే ప్రయాణికుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల ఉందని.. దానికి ప్రధాన కారణం మహాలక్ష్మి పథకంగా ఎల్ అండ్ టీ ఇన్వెస్టర్ రిలేషన్స్ హెడ్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa