ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్‌.. డిప్యూటీ సీఎం రియాక్షన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 07:33 PM

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ చేసిన ట్విట్‌కు తెలంగాణ సర్కార్ స్పందించింది. ఆన్‌లైన్‌లో.. ఫన్ అండ్ డ్యాంక్ పేరుతో పలువురు నెటిజన్లు చేసే అసహ్యమైన, జుగుప్సాకరమైన కామెంట్లపై సాయిధరమ్ తేజ్ ఓ ట్విట్ చేశారు. ఇలా ఫన్ పేరుతో.. చిన్న పిల్లల జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే రాక్షసులు బయటికి కనిపించరని చెప్తూనే.. అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి జుగుప్సాకరమైన చర్యలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సాయిధరమ్ తేజ్ కోరారు.


"ఇది భయంకరమైనది, అసహ్యకరమైనది. ఫన్ అండ్ డ్యాంక్ అనే పేరుతో.. ఆన్‌లైన్‌లో పిల్లలపై ఇష్టమొచ్చినట్టుగా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న ఇలాంటి రాక్షసులను గుర్తించలేం. పిల్లల భద్రత ఈ సమయంలో చాలా అవసరం. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రి నారా లోకేష్‌‌ను నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి భయంకరమైన చర్యలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా." అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. పిల్లలపై కామెంట్స్ చేస్తున్న కొందరు వ్యక్తుల సంభాషణకు సంబంధించిన ఓ వీడియోను కూడా జత చేశారు.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్..


సాయిధరమ్ తేజ్ ట్వీట్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సమస్యను తమ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినందుకు సాయిధరమ్ తేజ్‌కు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ సర్కారుకు పిల్లల భద్రత అత్యంత ప్రాధాన్యత అని.. ఈ ఘటనను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ట్విట్‌కు రిప్లై ఇచ్చారు.


భట్టి విక్రమార్క స్పందన..


సాయిధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించారు. ఇలాంటి క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయిధరమ్ తేజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల భద్రత అనేది అత్యంత ప్రాధాన్యత అంశమని.. సోషల్ మీడియా వేదికగా పిల్లలపై జరుగుతున్న ఈ జుగుప్సాకరమైన చర్యలను నిరోధించేందుకు తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పిల్లలకు సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని సృష్టించడానికి కలిసి పని చేద్దామంటూ భట్టి విక్రమార్క రిప్లై ఇచ్చారు.


కాగా.. అందుకు ముందు కూడా ఇదే విషయంపై.. సాయిధరమ్ తేజ్ భారీ ట్వీట్ చేశారు. "సోషల్ మీడియా ప్రపంచం అనే చాలా క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయింది. దీన్ని నియంత్రించడం చాలా కష్టం.. కాబట్టి మీ పిల్లల వీడియోలు లేదా ఫోటోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసేటప్పుడు దయచేసి కాస్త ఆలోచించండి. ఇది తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి. లేదంటే.. సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది రాక్షసులు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాయి. అలాంటి రాక్షసుల నుంచి పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనపై ఉంది. కాబట్టి దయచేసి మీ పిల్లల ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి.. తగిన జాగ్రత్తలు తీసుకోండి. సోషల్ మీడియాలో నీచంగా ప్రవర్తించే రాక్షసులకు ఎప్పటికీ బాధిత తల్లిదండ్రుల క్షోభ అర్థం కాదు." అంటూ సాయి ధరమ్ తేజ్ ఆవేదన వ్యక్తం చేశారు.


సాయిధరమ్ తేజ్ లేవనెత్తిన ఈ సమస్యపై నెటిజన్లు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. సాయిధరమ్ తేజ్‌‌కు కామెంట్ల రూపంలో తమ మద్దతుకు ప్రకటిస్తున్నారు. పిల్లలపై కూడా ఇలాంటి కామెంట్లు చేస్తూ ఫన్‌గా ఫీలవుతున్న రాక్షసులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కొద్ది రోజుల కిందట.. ఇంలాటి జోకులు వేసిన ఓ యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa