ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణించేవారికి ఆర్టీసీ గుడ్‌న్యూస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2024, 07:16 PM

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి వానలు పడుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కురిసిన వర్షానికి వరదలు పొంగి.. జన జీవనం అస్తవ్యస్తం కాగా.. మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో జనం భయం భయంగా బతుకున్నారు. రోడ్లు, రైలు మార్గాలు.. వరద తాకిడికి కొట్టుకుపోయి.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో బస్సులు నడపడాన్ని అధికారులు తగ్గించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.


భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న వేళ టీజీఎస్ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ - విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు టికెట్‌ ధరలో 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.


హైదరాబాద్ - విజయవాడ మధ్య నడిచే రాజధాని, ఏసీ, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ఈ 10 శాతం డిస్కౌంట్ సౌకర్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఇక బస్ టికెట్లు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునేందుకు https://www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ అధికారులు సూచించారు.


అయితే రెండు రాష్ట్రాల మధ్య అత్యంత రద్దీ మార్గాల్లో హైదరాబాద్- విజయవాడ రూట్‌ ఒకటి. కాగా ప్రస్తుత వర్షాలు, వరదల కారణంగా ప్రయాణికులకు కాస్త ఊరట కల్పించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 10 శాతం రాయితీ ఆఫర్ ఈ నెల 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడ నగరాల మధ్య ప్రయాణించే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa