పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు అసెంబ్లీ స్పీకర్ ముందుంచాలని చెప్పింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి నాలుగు వారాల గడువు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సరైన చర్యలు తీసుకోకపోతే.. సుమోటోగా తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలను ముగించిన హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీని ఫిరాయించినందుకు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలంటూ స్పీకర్కు పార్టీ తరపున నోటీసులు ఇచ్చామని చెప్పారు. అయినా ఇప్పటి వరకు అసెంబ్లీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఎప్పుడు ఇస్తారు..? ఎప్పటి వరకు వాదనలు వింటారు..? ప్రోసిడింగ్స్ ఎప్పుడు పూర్తవుతుందనే.. నాలుగు వారాల్లోగా షెడ్యూల్ చేయాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించింది. ప్రోసిడింగ్స్ అనంతరం స్టేటర్ రిపోర్టు ఇవ్వాలని ధర్మాసనం వెల్లడించింది. లేకుంటే తామే సమోటోగా విచారణ జరపుతామని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు అని అన్నారు. హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టే విధంగా న్యాయస్థానం తీర్పు ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమన్నారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ గెలుపు తథ్యమని జోశ్యం చెప్పారు. న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర శాసనసభాపతి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామని హరీష్ ట్వీట్ చేశారు.
కాగా, అధికార కాంగ్రెస్ పార్టీలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిన విషయం తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించగా.. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారిపై అనర్హత వేయాలని స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేయగా.. ఫలితం లేకపోవటంతో కోర్టును ఆశ్రయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa