ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఉపఎన్నికలు.... హరీష్ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 07:26 PM

తెలంగాణ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారనున్నాయి. మొన్నటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఇప్పుడు వారిపై అనార్హత వేటు అంశం సర్వత్రా ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు.. కీలక తీర్పునిచ్చింది. సదరు ఎమ్మెల్యేలపై.. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం సూచించింది. అనర్హత పిటిషన్లు స్పీకర్‌ ముందుంచాలని.. ఆదేశించింది. ఎప్పటి వరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్‌ పూర్తి చేయాలన్నది షెడ్యూల్‌ విడుదల చేయాలని తెలిపింది. 4 వారాల్లో స్టేటస్‌ రిపోర్ట్‌ అందజేయాలని హైకోర్టు కోరింది. ఒకవేళ.. నాలుగు వారాల్లో షెడ్యూల్‌ రిలీజ్ చేయకపోతే సుమోటోగా విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు పేర్కొంది.


అయితే.. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావటం ఖాయమని.. బీఆర్ఎస్ నాయకులు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రి హరీష్ రావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.


ఎమ్మెల్యేల అన‌ర్హత ఫిటిష‌న్‌ల‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎమ్మెల్యేల అన‌ర్హత అప్లికేష‌న్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాల‌కు చెంప పెట్టని అభివర్ణించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హత‌కు గురికావ‌డం త‌థ్యమని చెప్పుకొచ్చారు. తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిల‌బెట్టే విధంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన‌ర్హత‌కు గురై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉపఎన్నిక‌లు రావ‌డం ఖాయమన్నారు. అన‌ర్హత కార‌ణంగా ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్‌ఎస్ గెలుపు త‌థ్యమన్నారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర శాస‌న‌స‌భాప‌తి 4 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడ‌తార‌ని ఆశిస్తున్నట్టు హరీష్ రావు చెప్పుకొచ్చారు.


మరోవైపు.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా హైకోర్టు తీర్పుపై స్పందించారు. మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావటం ఖాయమని వ్యాఖ్యానించారు. 4 వారాల్లో చర్యలు తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాల్సివస్తుందని హై కోర్టు హెచ్చరించిందని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. దీంతో.. మూడు స్థానాల్లో ఉపఎన్నికలు రావటం ఖాయమైపోయిందని.. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa