గతవారం రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతోన్న గణపతి నవరాత్రులు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబరు 17 మంగళవారం హైదరాబాద్ నగరంలో జరిగే నిమజ్జనంపై తెలంగాణ పోలీసులు శుక్రవారం కీలక మార్గదర్శకాలను వెలువరించారు. శోభాయాత్ర రోజున పాటించాల్సిన నిబంధనలు, సూచనలను పేర్కొన్నారు. గణనాథుడి విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. నిమజ్జనం రోజున సౌత్ జోన్ పరిధిలో విగ్రహాలను తీసుకెళ్లేవారు ముందుగానే బయలుదేరాలని, వాహనానికి ఏసీపీ కేటాయించిన నంబర్ను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిబంధనలు పోస్ట్ చేశారు. మరోవైపు, హైకోర్టు ఆదేశాలతో ట్యాంక్ బండ్పై విగ్రహాల నిమజ్జనానికి అనుమతిలేదని కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. మొత్తం 15 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్లో విగ్రహాలకు అనుమతి ఉంటుందని తెలిపారు.
సిటీ పోలీసుల నిబంధనలు
ఒక విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతి.. విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ను ఏర్పాటుచేయరాదు. నిమజ్జనం రోజు వాహనాలపై డీజేతో కూడిన మ్యూజికల్ సిస్టమ్కు అనుమతి లేదు. రంగులు చల్లుకునేందుకు కాన్ఫెట్టి తుపాకుల వాడకం నిషేధం. విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తులకు అనుమతి ఉండదు.
రోడ్డుపై వాహనం వెళ్లేటప్పుడు ట్రాఫిక్కు అంతరాయం కలిగించరాదు. విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనం ఇతర వాహనాలకు, ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర లేదా మార్గంలో నిలపరాదు. అప్పటి పరిస్థితులను బట్టి పోలీసులు ఇచ్చే ఆదేశాల మేరకు వాహనాల కదలికలు ఆధారపడి ఉంటాయి. ఊరేగింపులో కర్రలు / కత్తులు, కాల్పులు ఆయుధాలు, మండే పదార్థాలు లేదా ఇతర ఆయుధాలను వెంట తీసుకురాకూడదు. జెండాలు లేదా అలంకరణ కోసం ఉపయోగించే కర్రలు 2 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉండరాదు. వెర్మిలియన్, కుంకుమ లేదా గులాల్లను రోడ్డుపై వెళ్లేవారిపై చల్లరాదు.
ఊరేగింపులో ఎలాంటి రాజకీయ/ రెచ్చగొట్టే ప్రసంగాలు/ నినాదాలు లేదా రెచ్చగొట్టే సంకేతాలు లేదా బ్యానర్లు ఉపయోగించరాదు. ఏ వర్గానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే ఇతర రెచ్చగొట్టే చర్యలకు పాల్పడరాదు. ఊరేగింపు సమయంలో బాణాసంచాపై పూర్తి నిషేధం ఉంటుందని, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలను పాటించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని మార్గదర్శకాల్లో పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa