ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికింద్రాబాద్‌ నుంచి కొత్త వందే భారత్ ట్రైన్.. ఎల్లుండే ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 07:30 PM

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతోంది. ప్రజల నుంచి కూడా వందే భారత్ ట్రైన్లకు విశేష స్పందన లభిస్తుండటంతో.. కేంద్ర ప్రభుత్వం కొత్త సర్వీసులను కూడా ప్రారంభిస్తోంది. అయితే.. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పలు మార్గాల్లో వందే భారత్ ట్రైన్లు పరుగులు పెడుతుండగా.. రెండు రోజుల్లో మరో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్- నాగపూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో.. ఆ ఎక్స్‌ప్రెస్ మార్గంలోని ప్యాసింజర్ల నుంచి దక్షిణ మధ్య రైల్వేకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.


సికింద్రాబాద్- నాగపూర్ మధ్య 578 కిలో మీటర్ల దూరాన్ని ఈ రైలు 7.15 గంటల్లోనే చేరుకోనుంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన ఈ ట్రైన్.. రామగుండం, కాజీపేటలో ఆగనుంది. వారంలో మంగళవారం మినహా ప్రతిరోజూ ఈ ఎక్స్‌ప్రెస్‌ సేవలు అందించనుంది. కాగా.. ఈ రూట్‌లో ఉన్న మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో కూడా ఈ వందే భారత్ ట్రైన్‌ను ఆపాలని.. అక్కడి స్థానిక ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అమృత్ భారత్ పథకంలో ఎంపికైన మంచిర్యాల రైల్వేస్టేషన్‌లోనూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆపితే.. అక్కడి ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగమవుతోందని వివరిస్తున్నారు.


తాజాగా నిత్యం 20 వేల ప్రయాణికులతో.. ప్రతిరోజు సుమారు రూ.5 లక్షల ఆదాయంతో దక్షిణ మధ్య రైల్వేలో మంచిర్యాల రైల్వే స్టేషన్‌ ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. మంచిర్యాల రైల్వే స్టేషన్ స్వచ్ఛత విషయంలో దక్షిణ మధ్య రైల్వే విభాగంలో రెండుసార్లు పురస్కారాలు కూడా దక్కించుకుంది. ఇలాంటి మంచిర్యాల రైల్వే స్టేషన్ మీద చిన్నచూపు చూడొద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.


గతంలోనూ.. రైల్వే అధికారులకు చాలాసార్లు విజ్ఞప్తులు చేశామని.. కానీ.. వాళ్ల నుంచి స్పందన శూన్యమని స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే.. సెప్టెంబర్ 15న ప్రారంభమవుతున్న.. సికింద్రాబాద్- నాగపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో ఆపేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. దీనివల్ల మంచిర్యాల ప్రాంత ప్రజలకు చాలా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటున్నారు.


మంచిర్యాల నుంచి సికింద్రాబాద్‌తో పాటు నాగపూర్‌కు వేలాది మంది ప్రయాణాలు సాగిస్తూ ఉంటారని స్థానికులు చెప్తున్నారు. అయితే.. ముఖ్యమైన రైళ్లు మాత్రం ఆగకపోతుండటంతో.. చాలామంది ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను నమ్ముకుంటున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏ ఒక్క రైలు లేదని వాపోతున్నారు. కాబట్టి.. కొత్తగా ప్రారంభమవుతున్న వందే భారత్ రైలును మంచిర్యాలలో నిలిపేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa