తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ పేరుతో వారిని వంచనకు గురిచేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చిన రేవంత్.. మాట తప్పటంతో పాటు అర్హులకు రుణమాఫీ చేయకుండా వారి ప్రాణాలను బలితీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. రుణమాఫీ కాలేదని కొందరు, పెట్టుబడి సాయం రైతు భరోసా లేక కొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరం. కేసీఆర్ గారు రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుంది. రైతు రుణమాఫీ అంత బోగస్, రైతు భరోసా కూడా బోగస్. నిన్ రైతు సురేందర్ రెడ్డి అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లికి, తనకు ఉన్న రుణం మాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగాకు బలైపోయాడు.
నేడు రైతు సాగర్ రెడ్డి భార్యాభర్తలిద్దరిలో ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో జగిత్యాలలో పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన పేరిట ఉన్న లక్షన్నర రుణం, తన భార్య పేరిట ఉన్న లక్షా 60 వేల రుణంలో ఏ ఒక్కరికి రుణ మాఫీ అయినా గట్టెక్కుతానని గంపెడాశలు పెట్టుకుని దారుణంగా మోసపోయాడు. ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలి ? ఏకకాలంలో అందరికీ 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాటతప్పిన సీఎంను ఏం చేయాలి ?
డిసెంబర్లో పెట్టిన డెడ్ లైన్ సెప్టెంబర్ దాటినా అమలుకాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలి ? 49,500 వేల కోట్ల రుణమాఫీలో పావుశాతం కూడా చేయకుండా చేతులెత్తేసినందుకు రైతన్నలకు క్షమాపణలు చెప్పండి. ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళు చల్లారుతాయి ? రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలు చేయటం కాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. దైర్యంగా ఉండాలని కోరుతున్నాను. అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa