ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఎమ్మార్వో మామూలు ఆవిడ కాదు.. కిందిస్థాయి ఉద్యోగితో కలిసి ఇలాంటి పనులా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 07:22 PM

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతుల కోసం తీసుకొచ్చిన రైతుబంధు పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సాగులో లేని భూములకు సైతం రైతు బంధు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. పలువురు నేతలు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బులు కాజేశారని మంత్రి తుమ్మల ఇటీవల విమర్శలు చేశారు. తాజాగా.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లేని భూమిని ఉన్నట్లు చూపించి పాస్ పుస్తకాలు సృష్టించిన ఎమ్మార్వో భారీగా డబ్బులు కాజేసింది.


కింది స్థాయి ఉద్యోగి సహాయంతో డబ్బులు కాజేసింది. ఈ మేరకు తహసీల్దార్ జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో హుజూర్ నగర్ తహసీల్దారుగా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హుజూర్ నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసు పుస్తకాలు సృష్టించి రైతుబంధు నిధులు స్వాహా చేసినట్లు తేలింది. మెుత్తం రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు పక్కదారి పట్టించి‌నట్లు అధికారుల విచారణలో తేటతెల్లమైంది. ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019లో ఎమ్మార్వో జయశ్రీ పట్టాదారు పాసుబుక్‌లు జారీ చేసింది.


అనంతరం రైతు బంధు నిధులు కాజేసి తహసీల్దార్ జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్ చెరిసగం చొప్పున పంచుకున్నట్లు తేలింది. ఎమ్మార్వోపై అవినీతి ఆరోపణలు రావటంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు, పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తహసీల్దార్‌పై 420, 406, 409, 120(b), 468, 467 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్‌గా జయశ్రీ విధులు నిర్వహిస్తున్నారు. ఎమ్మార్వో రైతు బంధు నిధులు నొక్కేయటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఉన్నత స్థానంలో ఉండి ఇలాంటి పనులేంటి మేడం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


కాగా, రైతుబంధు పథకం నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధమైంది. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అదించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. అధికారులు పక్కాగా సర్వే నిర్వహించి కేవలం పంట సాగు చేసే భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందజేస్తారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనే రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలు, సాగులేని భూములకు పంట పెట్టుబడి సాయం అందిచబోమన్నారు.


కాగా, గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు రూ. 10 వేల పంట పెట్టబడి సాయం అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింది ఎకరాకు రూ. 15 వేలు రెండు విడతల్లో అందించేందుకు సిద్ధమైంది. దసరా తర్వాత ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa