ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. టికెట్ ఛార్జీలు పెంపు, ఎంత పెంచారంటే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 07:20 PM

తెలంగాణలో అతిపెద్ద పండగ అయిన దసరా కోసం వివిధ నగరాలు, పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లో ఉపాధి కోసం వెళ్లినవారు ఈ పండక్కి సొంతూళ్లకు వెళ్తుంటారు. దసరా రద్దీ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా 6,300 బస్సులు నడుపుతోంది. అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద మరో 600 బస్సులను అదనంగా నడిపిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఇప్పటికే నగరంలోని ప్రజలు తమ తమ సొంతూళ్లకు పయనం అవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు హాలిడేస్ ప్రకటించటంతో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లోనూ విపరీతమైన రద్దీ ఉంటుంది.


 అయితే పండక్కి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాకింగ్ న్యూస్ చెప్పింది. దసరా వేళ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టేందుకు రెడీ అయింది. టికెట్ ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దసరా రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని ప్రకటించిన ఆర్టీసీ.. ఆ ప్రత్యేక అదనపు ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది. రిటర్న్ జర్నీలో ఖాళీగా బస్సులు రావాల్సి ఉంటుందని.. అందుకే కొంత ఛార్జీలు పెంచినట్లు ఎండీ సజ్జనార్ వివరించారు. సాధారణ బస్సుల్లో టికెట్ ధరలు అలాగే ఉంటాయని.. స్పెషల్ బస్సుల్లో మాత్రమే అదనంగా ఛార్జీలు ఉంటాయని చెప్పారు.


దసరాకు నడుపుతున్న ప్రత్యేక బస్సు సర్వీసుల్లో టికెట్‌ బేసిక్‌ ధరలో 50 శాతం పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికుల జేబుకు భారీగా చిల్లు పడింది. ఉదాహరణకు హైదరాబాద్‌-నల్గొండ డీలక్స్ రెగ్యులర్‌ బస్‌లో ఛార్జీ రూ.200 ఉండగా.. స్పెషల్ బస్సుల్లో రూ.300 వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో నడిపే సిటీ ఆర్డినరీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులనూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు స్పెషల్ బస్సుల పేరుతో నడుపుతున్నారు. ఈ బస్సుల్లో టికెట్ ఛార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు.


దసరా రద్దీ దృష్ట్యా ప్రతి డీలక్స్‌ బస్సునూ ప్రత్యేక బస్సు చేయటంతో సూపర్‌లగ్జరీ ఛార్జీల్ని డీలక్స్‌ బస్సులు మించిపోయాయి. హైదరాబాద్‌-ఖమ్మం మధ్య నేడు 13 డీలక్స్‌ బస్సులుంటే అన్నీ కూడా అదనంగా 50 శాతం ఛార్జీలతో నడిచే ప్రత్యేక బస్సులే ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రెగ్యులర్ సూపర్‌ లగ్జరీ టికెట్‌ ధర రూ.430 అయితే.. డీలక్స్‌ దసర్ స్పెషల్ బస్సులో ఛార్జీ రూ.440గా నిర్ణయించారు. దీంతో ప్రయాణికులు లోబోదిబోమంటున్నారు. ఇప్పటికే నిత్యవసర ధరలు ఆకాశన్నంటుతున్నాయని.. ఇప్పుడు టికెట్ ధరలు కూడా పెంచితే తాము ఎలా పండగ చేసుకునేదని నిట్టూరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa