ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాడ్‌లక్ అంటే ఇదేనేమో.. పోస్టాఫీస్ అధికారుల నిర్లక్ష్యంతో యువకుడికి చేజారిన ప్రభుత్వ ఉద్యోగం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 07:51 PM

ఈ లోకంలో డబ్బు కంటే విలువైనది ఏదైనా ఉందంటే.. అది సమయం మాత్రమే. గడిపోయిన కాలాన్ని ఏం చేసినా మళ్లీ తిరిగి తీసుకురాలేం. అందుకే ప్రతి క్షణం చాలా విలువైందని.. సమయాన్ని వృథా చేసుకోవద్దని పెద్దలు చెప్తుంటారు. జీవితాలు తారుమారు అయ్యేందుకు ఒక్క క్షణం చాలు అంటుంటారు. ఇలాంటివి.. పరీక్షల సమయంలో బాగా అర్థమవుతుంటాయి. నిమిషం లేట్ అయినా పరీక్షకు హాజరుకాకపోతే.. ఆ పరీక్ష తప్పినందుకు విద్యార్థులు చాలా బాధపడిపోతుంటారు. కానీ.. ఇక్కడ ఓ యువకుడు ఏకంగా తన ప్రభుత్వ ఉద్యోగాన్నే కోల్పోయాడు. అయితే.. తాను లేట్ అయినందుకు కాదు.. తనకు వచ్చే లెటర్ లేట్ అయినందుకు. మరి ఆ లెటర్ ఎందుకు లేట్ వచ్చిందన్న దానికి మాత్రం పోస్టాఫీస్ ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణం.


ప్రభుత్వ ఉద్యోగం వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆ యువకుడు భావించాడు. అందుకోసం ఎన్నో కలలుకన్నాడు. అందుకోసం చాలా శ్రమించాడు. మొక్కవోని దీక్షతో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే.. అతనికి ఉద్యోగం దక్కించుకునే ఛాన్స్ వచ్చింది. నోటి వరకు వచ్చిన ముద్ద మట్టిపాలైందన్నట్టుగా.. తపాలాశాఖ నిర్లక్ష్యంతో ఆ యువకుడికి ఉద్యోగం అడుగు దూరంలో చేజారిపోయింది. ఈ బాధాకరమైన విషయం మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో జరిగింది.


జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడు డిగ్రీ చదివాడు. ఆ తర్వాత.. పోలేపల్లిలోని ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఓ వైపు పనిచేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్నాడు. అతని ప్రయత్నాల్లో భాగంగానే.. 2023లో తెలంగాణ విద్యుత్ రెగ్యూలేటరీ కమిషన్‌లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు నాగరాజు. మెరిట్ మార్కులు, జోనల్‌లో ఎస్సీ కోటాలో ఒకే ఉద్యోగం ఉండటంతో ఇంటర్వ్యూకు అర్హత పొందాడు.


2024 సెప్టెంబర్ 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఒరిజినల్ సర్టిఫికేట్లతో హైదరాబాద్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు అటెండ్ కావాల్సిందిగా.. అధికారులు సెప్టెంబర్ 4న నాగరాజుకు స్పీడ్ పోస్ట్ ద్వారా లెటర్ పంపించారు. ఇంటర్వ్యూ సమయానికి హాజరుకాకపోయినా, సర్టిఫికెట్లు సరిగ్గా లేకపోయినా ఉద్యోగానికి అనర్హులవుతారని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే.. స్పీడ్ పోస్టు ద్వారా పంపిన ఆ లేఖ ఇంటర్వ్యూ గడువు ముగిసిన వారానికి గానీ.. నాగరాజును చేరుకోలేదు.


అక్టోబర్ 4న నాగరాజుకు లేఖ అందగా.. అందులో చూస్తే ఇంటర్వ్యూ తారీఖు సెప్టెంబర్ 27 అని ఉండటం చూసి హతాశుడయ్యాడు. వెంటనే అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేసి.. అధికారులను సంప్రదించగా ఇంటర్వ్యూకు హాజరుకాకపోవడంతో ఇంకోకరికి ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో.. నాగరాజు కలల్లో కట్టుకున్న ఆశల సౌధం కన్నీళ్ల రూపంలో కారిపోయింది. చేతికి అందివచ్చిన జాబ్ చేజారిపోవటంతో.. తీవ్రంగా బాధపడ్డాడు.


తనకు ఉద్యోగం చేజారిపోవటానికి కారణం తాను ఎంతమాత్రం కాదని.. అందుకు కేవలం పోస్టాఫీస్ అధికారులేనని గ్రహించి.. బంధువులు స్నేహితులతో కలిసి జడ్చర్లలోని తపాలాశాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రవికుమార్‌ను నిలదీశాడు. దీనిపై అసిస్టెంట్ సూపరింటెండెంట్ స్పందిస్తూ.. గంగాపూర్ గ్రామానికి ఉత్తరాలు పంపిణీ చేసే వ్యక్తి సెప్టెంబర్ 24వ తేదీన రిజైన్ చేశాడని.. అతని స్థానంలో ఇంకో వ్యక్తికి ఆ బాధ్యత అప్పగించామన్నారు. అయితే.. సెప్టెంబర్ 18న లేఖ అందించినట్లు సిబ్బంది చెబుతున్నా అదంతా అబద్దమని తెలిసిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.


ఏది ఏమైనా.. నాగరాజుకు మాత్రం పోయిన ఉద్యోగం తిరిగిరాదు. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా కూడా.. ప్రభుత్వ శాఖ అధికారులు ఇప్పటికీ లెటర్లు పంపించటమేంటనేది అర్థంకాని విషయం. లెటర్ ద్వారా కాకుండా.. మెయిల్ ద్వారానో.. ఫోన్‌కు మెస్సేజ్ ద్వారానో.. కాల్ చేసో సమాచారం ఇచ్చి ఉంటే.. ఇదంత సమస్య ఉండేదే కాదన్నది అందరూ ఒప్పునే విషయం. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తూ.. కూర్చున్న దగ్గరే అన్ని పనులు చేసుకుంటున్న ఈ కాలంలో.. కేవలం లెటర్ అందకపోవటం వల్ల ఒక యువకుడికి ఉద్యోగం చేజారటం శోచనీయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa