ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోదావరి పుష్కరాలకు కేంద్రం నిధులు.. ఏపీకి 100 కోట్లు.. తెలంగాణకు ఇంత ఘోరమా..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 10:45 PM

12 ఏళ్లకు ఓసారి జరిగే గోదావరి పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. వచ్చే ఏడాది (2027) జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. అయితే.. ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. గోదావరి ప్రవహించే.. మ‌హారాష్ట్ర, తెలంగాణ‌, చ‌త్తీస్ ఘ‌డ్‌, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పుష్కరాలు ఘనంగా జరగనున్నాయి. 12 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ పుష్కరాలకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయనున్నాయి. అయితే.. భక్తులు పుష్కర స్నానాలు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వాలు గోదావరి ఒడ్డున పుష్కర ఘాట్లు నిర్మిస్తాయి. అయితే.. వీటి నిర్మాణంతో పాటు న‌దికి ఇరువైపులా భక్తుల సౌకర్యాల నిమిత్తం చేపట్టే పనుల కోసం కేంద్రం కూడా నిధులు విడుద‌ల చేస్తుంటుంది.


కేంద్రం ఇచ్చే నిధుల‌తో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సొంత డబ్బులు కలిపి.. పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తుంటాయి. అయితే.. ఈసారి కేంద్రం విడుదల చేసిన నిధులను బట్టి చూస్తే.. పూర్తి రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నట్టు అర్థమవుతోంది. అందుకు కారణం.. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో పుష్కరాల కోసం 100 కోట్ల నిధులు కేటాయించగా.. తెలంగాణ‌కు మాత్రం ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవటమే.


అయితే.. ఏపీలో ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ సర్కారు కాబట్టి ఆ రాష్ట్రానికి 100 కోట్లు ఇచ్చింది అనుకుందాం.. మరి ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణకు కనీసం పది కోట్లో.. చివరికి 5 కోట్లయినా ఇవ్వాల్సింది కదా అంటున్నాటన్నారు విశ్లేషకులు. ఇలా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా.. తెలంగాణలో 8 సీట్లలో బీజేపీ ఎంపీల‌ను గెలిచిపించి ఢిల్లీకి పంపించిన తెలంగాణ ప్రజ‌ల‌ను కేంద్రం అవ‌మానించినట్టే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


నిజానికి.. గోదావ‌రి న‌ది ఆంధ్ర ప్రదేశ్‌లో కంటే తెలంగాణ‌లోనే ఎక్కవ భూభాగంలో ప్రవహిస్తుంటుంది. మ‌హారాష్ట్రలోని త్రయంబకేశ్వరం వ‌ద్ద బ్రహ్మగిరి ప‌ర్వతాల‌లో పుట్టిన గోదావ‌రి నది.. మొత్తంగా 1465 కిలోమీట‌ర్లు ప్రవ‌హిస్తూ.. చివరికి బంగాళాఖాతంలో క‌లుస్తుంది. ఈ న‌ది మ‌హారాష్ట్రలో 48.6 శాతం, తెలంగాణ‌లో 18 శాతం, చ‌త్తీస్ ఘ‌డ్‌లో 10.9 శాతం, ఒడిశాలో 5.7 శాతం ప్రవహిస్తే.. అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో 4.5 శాతం ప్రవ‌హిస్తోంది.


అయితే.. పుష్కర స్నానాలు ఈ 5 రాష్ట్రాల్లోనూ జ‌రుగుతాయి. కానీ గోదావ‌రి న‌ది కేవ‌లం 4.5 శాతం మాత్రమే ప్రవ‌హించే ఏపీకి రూ.100 కోట్లు ఇచ్చిన కేంద్రం.. 18 శాతం భూభాగంలో గోదావ‌రి ప్రవ‌హిస్తున్న తెలంగాణ‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వక‌పోవ‌డంపై తెలంగాణ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత మాత్రాన.. ఇలా వివక్ష చూపించటం సరికాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.


  పుష్కరాల నిధుల్లో తెలంగాణ‌కు కేంద్రం తీర‌ని అన్యాయం చేసిందంటూ.. మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్లు ఇచ్చి.. తెలంగాణ‌కు మాత్రం గుండుసున్నా చూపించింద‌ంటూ మండిపడ్డారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా సాధించలేకపోవటాన్ని హరీష్ రావు దుయ్యబట్టారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయడంలో.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. నిధుల కేటాయింపులో మొదటి నుంచే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపిస్తోందని హరీష్ రావు చెప్పుకొచ్చారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని.. హక్కుగా రావాల్సిన నిధులను కచ్చితంగా ఇవ్వాలని కేంద్రాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa