తెలంగాణ యువతను ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలు, అధునాతన హంగులతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం నిర్మించనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలో దాదాపు 57 ఎకరాల విస్తీర్ణంలోని ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. అక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తోపాటు.. అకడమిక్ బ్లాక్, బాలికలు, బాలురకు వేర్వేరుగా హాస్టల్స్, వర్క్ షాప్లు, స్టాఫ్ క్వార్టర్లు, డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.
సువిశాలమైన ఆడిటోరియం, లైబ్రరీ, ప్లేయింగ్ గ్రౌండ్, పార్కింగ్ ఏరియా ఉండేలా డిజైన్లు రూపొందించారు. ఇందుకు సంబంధించి పలు నమూనాలను సర్కారు తయారు చేయించింది. స్కిల్ యూనివర్సిటీలో ఎక్కువ ఖాళీ స్థలం, పచ్చదనం ఉండేలా డిజైన్లు తయారు చేయించారు. 6 వేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, బోర్డింగ్ సదుపాయాలు ఉండేలా క్యాంపస్లో నిర్మాణాలను చేపట్టనుంది. భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ మధ్య ఇటీవల అవగాహన ఒప్పందం కుదిరింది. స్కిల్స్ వర్సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ. 200 కోట్లు కేటాయించింది. అదానీ కంపెనీ సైతం రూ.100 కోట్ల విరాళం అందజేసింది.
ఇక ఈ స్కిల్ యూనివర్సిటీ శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఈజీగా చేరుకునేందుకు కొత్త హైవే నిర్మించనున్నారు. ఈ మేరకు టీజీఐఐసీ, హెచ్ఎండీఏ, రహదారులు భవనాల శాఖల అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 రావిర్యాల నుంచి కొంగరకలాన్ మీదుగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే మీర్ఖాన్పేట్..వరకు అక్కడి నుంచి ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి వద్ద కొత్తగా ఏర్పాటు చేయనున్న రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేయనున్నారు. దాదాపు 40 కిలోమీటర్ల మేర ఈ కొత్త రహదారి అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ హైవేను ఔటర్ రింగు రోడ్డు మాదిరిగా 200 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు. ఈ మేరకు రావిర్యాల నుంచి ఆకుతోటపల్లి వరకూ ఉన్న మార్గంలోని కొన్ని గ్రామాల మీదుగా ఈ వెళ్లనుంది. ఇప్పటికే భూసేకరణపై రెవెన్యూ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాగా, ఈ రోడ్డు పూర్తయితే ఆయా గ్రామాలకు మహర్దశ పట్టనుంది. భూముల ధరలకు రెక్కలు రానున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa