ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం ఈ పథకంపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. నవంబర్ 6 (రేపటి నుంచి) నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ఉంటుందని చెప్పారు. ఆర్ధికంగా ఎంత ఇబ్బంది ఉన్నా.. తల తాకట్టు పెట్టయినా ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేస్తాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తమ ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. 15 రోజుల్లొ గ్రామ కమిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి ఆ వెంటనే జాబితాల ఖరారు చేస్తామన్నారు. ఇది నిరంతర ప్రక్రియగా ఉంటుందని చెప్పారు.
కాగా, ప్రభుత్వం నుంచి ఏ పథకం ద్వారా లబ్ధి పొందాలన్న రేషన్ కార్డు తప్పనిసరి. అయితే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. రేవంత్ సర్కార్ ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నా.. కొత్త రేషన్ కార్డులు మాత్రం మంజూరు కాలేదు. దీంతో చాలా మంది ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా ఉన్నా.. రేషన్ కార్డు లేకపోవటంతో తమకు ఇండ్లు రావనే ఆవేదనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో కీలక అప్డేట్ ఇచ్చారు. రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఇది కేవలం ప్రస్తుతానికే వర్తిస్తుందన్నారు. మొదటి విడతలో రేషన్ కార్డులు లేనివారికి కూడా ఇండ్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండో విడత నుంచి మాత్రం రేషన్ కార్డు ఉంటేనే అర్హులని చెప్పారు.
ఇక గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఎంపికే ఫైనల్ అని మంత్రి వెల్లడించారు. ఇండ్లు మహిళల పేరిటే మంజూరు చేస్తారని.. లబ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండబోదని చెప్పారు. నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పేదరికమే ప్రామాణికంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ఉంటుందన్నారు. లబ్దిదారుల ఎంపికలో ప్రత్యేక యాప్ దే కీలకపాత్ర అని.. అందుకే ఇంత సమయం పట్టిందన్నారు. నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు చెప్పారు. నిర్మాణ దశల వారీగా లబ్దిదారులకు చెల్లింపులు ఉంటాయన్నారు. పునాదికి రూ.లక్ష గోడలకు రూ.1.25 లక్షలు, శ్లాబ్కు 1.50 లక్షలు, ఇళ్లు పూర్తయిన తర్వాత మరో లక్ష చొప్పున చెల్లింపు ఉంటాయని చెప్పారు. కాగా తొలి విడతలో రేషన్ కార్డులు అవసరం లేదన్న మంత్రి ప్రకటన పట్ల అర్హులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa