ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా జై తెలంగాణ అన్నారా?'.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 07:00 PM

దీక్షా దివస్ సందర్భంగా.. సిద్దిపేటలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా తన నోటి వెంట జై తెలంగాణ అని అన్నారా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్క కేసు ఉందా..? ఒక్కనాడైనా అమరులకు పూలు వేశారా.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. అలుగునూరులో కేసీఆర్‌ను అరెస్టు చేసిన ఆనవాళ్లు, ఖమ్మం జైలులో దీక్ష చేసిన అనవాళ్లు తుడుస్తావా.. లేక తెలంగాణ సాధించి, తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆనవాళ్లు తుడిచేస్తావా? అంటూ రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీశారు. జై తెలంగాణ అన్న వారిపై తుపాకీతో వెళ్లిన మరక జీవితంలో ఎన్నటికీ పోదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


దీక్షా దివాస్ సందర్భంగా.. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకొస్తున్నాయని హరీష్‌ రావు తెలిపారు. కొందరు దొంగలు పార్టీలోకి వచ్చారని.. పందికొక్కుల్లగా తిని మళ్లీ వెళ్లిపోయారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కాపాడాలని కేసీఆర్ ఆరోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని.. ఇకపై అలాంటి వారికి పార్టీలో చోటు ఉండదని హరీష్ రావు స్పష్టం చేశారు.


తెలంగాణ రాష్ట్రం కోసం.. పదవులను గడ్డి పోచల్లా త్యాగం చేశామని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణకు అనుకూలమని తీర్మానాలు చేసి.. అవసరాలు తీరాక మాట మార్చేశారని దుయ్యబట్టారు. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మాట తప్పిందని గుర్తు చేశారు. ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశంలో ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ సంకల్పం తీసుకున్నారని.. కరీంనగర్ నుంచి దీక్ష కోసం వస్తుంటే ఆయన్ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. రాజకీయ ప్రక్రియ విఫలం కావడంతో గాంధీజీ అహింసా మార్గంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టారని తెలిపారు. నిమ్స్ ఆస్పత్రిలో రోజు రోజుకు కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్నా దీక్ష విరమణకు నిరాకరించారని వివరించారు. అయితే తెలంగాణ జైత్రయాత్ర.. లేదంటే కేసీఆర్ శవయాత్ర అంటూ కేసీఆర్ పట్టు పట్టారని ఆనాటి పరిస్థితులను నెమరువేసుకున్నారు.


తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్ 9న ప్రొఫెసర్ జయశంకర్ స్వహస్తాలతో రాసిన ప్రకటనను నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారని.. డిసెంబర్ 23న ఆ ప్రకటనను మళ్లీ వాపస్ తీసుకుందని హరీష్ రావు తెలిపారు. నాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని కోరితే నేటి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వెన్ను చూపారని విమర్శించారు. సిద్దిపేటలో తెలంగాణ కోసం చేపట్టిన దీక్ష శిబిరం 1531 రోజులు నడిపామని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణ కోసం సిద్దిపేటలో దీక్ష చేయని మనిషే లేడన్నారు. తెలంగాణ సాధనలో ఒక కార్యకర్తగా పాల్గొన్న తృప్తి మరిదేనితో సమానం కాదని హరీష్ రావు చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa