ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట బల్దియా కాంట్రాక్టర్లు ధర్నా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 09, 2025, 03:50 PM

హైదరాబాద్ మహనగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ ) కార్యాలయం ఎదుట బల్దియా కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. గురువారం ఉదయం కాంట్రాక్టర్లంతా ధర్నాకు దిగారు.పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే తమకు రావాల్సిన బకాయలు రూ. 1100 కోట్లు చెల్లించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ క్రమంలో ఓ కాంట్రాక్టర్.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పూనుకొన్నాడు. అక్కడే ఉన్న సహచర కాంట్రాక్టర్లు.. అతడి ప్రయత్నాన్ని అడ్డుకొన్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల బాధతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారం అందుకొనే క్రమంలో వెనుకా.. ముందు ఆలోచించకుండా రాజకీయ పార్టీలు.. ఉచిత హామీలకు తెర తీస్తోన్నాయి. దీంతో అధికారంలోకి వచ్చిన ఆయా పార్టీలు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత హామీలు.. తప్పక అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. తెలంగాణలో కొలువు తీరిన రేవంత్ ప్రభుత్వం మహలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ఆర్టీసీ భారీ నష్టాలను చవి చూస్తోంది.


మరోవైపు అంతకు కొన్ని నెలల ముందు కర్ణాటకలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం అమలు వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయిల నష్టం వస్తుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఆర్టీసీ ఛార్జీలు 15 శాతం మేరు పెంచుతోన్నట్లు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక తెలంగాణలో సైతం ఉచితాల పేరుతో ప్రజలకు అనేక పథకాలను గతంలో గద్దెనెక్కిన పార్టీలు సైతం ప్రకటించాయి.అందుకు ఏ పార్టీ మినహాయింపు కాదన్నది సుస్పష్టం. దీంతో ప్రభుత్వ ఖజాన నిండుకొంది. ఇంకోవైపు నగరంలోని ప్రధాన రహదారుల్లో సైతం వీధి దీపాలు వెలగడం లేదు. ఇదే విషయంపై గతంలో నగరంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకు వెళ్లారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ అధికారులను ఆయన ప్రశ్నించగా.. వీధి దీపాలకు గాను కరెంట్ ఛార్జీలు చెల్లించేందుకు జీహెచ్ఎంసీ వద్ద నిధుల లేవని చెప్పడం గమనార్హం.ఇది ఒక్కటే కాదు.. జీహెచ్ఎంసీ వార్డ్ కార్యాలయాల్లో ఆరోగ్య శిబిరాలను సైతం ప్రభుత్వం నిర్వహిస్తుంది. వాటిలో మందులు కూడా ఉండడం లేదు. దీంతో సుదుర ప్రాంతాల నుంచి మందుల కోసం వార్డు కార్యాలయాలకు పలువురు వ్యక్తులు వచ్చి.. మందులు లేవంటూ నిరాశతో వెను తిరిగి వెళ్తున్నారు. అదీకాక.. ఈ వార్డు కార్యాలయాలకు వైద్యులు సైతం సక్రమంగా హాజరు కావడం లేదు. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లుల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఏదీ ఏమైనా గద్దె నెక్కి పాలన సాగించే అధినేతలు.. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే చాలని.. అంతేకానీ ఉచిత పథకాలు ఎవరికి వద్దని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అందరికి అన్ని ఉచితాలు ఇస్తే.. కార్పొరేషన్‌లో పనులు జరగడం కష్టమని.. అలాగే ఆయా పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించడం మరింత కష్టమనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వేళ ఉచిత పథకాలను కట్టి పెట్టి.. ప్రభుత్వానికి ఆదాయలు సమకూరే మార్గాలను అన్వేషించాలని ప్రజాస్వామిక వాదులు సైతం ప్రజలకు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa