ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యాధునిక హంగులతో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 07:18 PM

ఏళ్లనాటి చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రి భవనం.. శిథిలావస్థకు చేరుకోవటంతో ఈ హాస్పిటల్‌కు కొత్త భవనాన్ని నిర్మించాలని గత కొన్నేళ్లుగా ప్రతిపాదన ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే.. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం నిర్మించాలన్న ప్రతిపాదన తెరపైకి రాగా.. అది కాస్తా వాయిదా పడుతూ వచ్చింది. అయితే.. ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవన నిర్మించే విషయంపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు.. రేపు (జనవరి 31న) ఉదయం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.


గోషామహల్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్మించనున్న కొత్త భవనం డిజైన్ల విషయంలో, ఆస్పత్రిలో ఉండాల్సిన సదుపాయాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. సకల సదుపాయాలతోనే కాదు.. అత్యాధునిక హంగులతో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని నిర్మించేలా కసరత్తు చేస్తోంది.


సుమారు 27 ఎకరాల్లో దాదాపు రూ. 2 వేల కోట్ల అంచనా వ్యయంతో కొత్త ఆస్పత్రి భవనాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్మించనుంది. 30 విభాగాలు, 2 వేల పడకలతో పాటు.. ఫిజియోథెరపీ, డెంటల్, కళాశాలలు, హాస్టల్ వసతులతో ఈ ఆస్పత్రి నిర్మాణం జరగనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు.. రానున్న టెక్నాలజీ కాలానికి అనుగుణంగా ఆస్పత్రి ప్రాంగణంలో హెలిప్యాడ్ సదుపాయం కూడా ఉండేలా ప్రభుత్వం డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


మరోవైపు.. ఆస్పత్రి నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఉస్మానియా ఆస్పత్రికి.. పెద్ద ఎత్తున వచ్చే ప్రజలను దృష్టిలో పెట్టుకుని విశాలమైన పార్కింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నారు.


ప్రతి డిపార్ట్‌మెంట్ కోసం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్‌తో కూడిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసీయూ వార్డులు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. కిడ్నీ, లివర్‌‌, స్కిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ల కోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగాన్ని కొత్త భవనంలో అందుబాటులోకి తీసుకురానున్నారు.


రోగుల సౌకర్యార్థం అన్ని రకాల డయాగ్నసిస్ సేవలను ఒకే చోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌‌లలో ఓపీ సేవలు అందించాలని.. పేషెంట్ల కోసం విశాలమైన వెయిటింగ్ హాల్స్ నిర్మించేలా డిజైన్లు చేస్తున్నారు. ఆస్పత్రికి కనీసం రోజూ 3 నుంచి 5 వేల మంది రోగులు వచ్చే అవకాశం ఉన్నందున.. అందుకు అనుగుణంగా ఓపీ కౌంటర్ల నిర్మాణం కూడా జరగనుంది. ఓపీ కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడే అవసరం లేకుండా కౌంటర్లు నిర్మించనున్నారు.


ఇక.. ఉస్మానియాలో ఆస్పత్రి కొత్త భవనంలో నర్సింగ్, డెంటల్, ఫిజియో థెరపీకి సంబంధించి కళాశాలలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. సంబంధించి కళాశాలల విద్యార్థుల కోసం ఆస్పత్రి ఆవరణలోనే హాస్టళ్లను కూడా నిర్మించనున్నారు. అంతేకాకుండా.. ఆస్పత్రిలోనే.. 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియంను కూడా నిర్మించనున్నట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa