ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షోకాజ్ నోటీసులపై తీన్మార్ మల్లన్న వైల్డ్ ఫైర్,,,పండబెట్టి తొక్కుతరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 07:59 PM

రేవంత్ రెడ్డి సర్కార్ విడుదల చేసిన కులగణన సర్వే రిపోర్టు.. రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ నివేదికపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న వేళ.. సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తి గళం వినిపిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. కాస్త గట్టిగానే తన దిక్కార స్వరం వినిపిస్తున్నారు. కులగణన సర్వేను తప్పుబట్టటమే కాకుండా.. నివేదిక పత్రాలను లైవ్‌లో కాల్చేటం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజేస్తోంది. గత కొంత కాలంగా బీసీ రాగాన్ని బలంగా వినిపిస్తున్న తీన్మార్ మల్లన్న.. సొంత పార్టీలో ఆయా వర్గాల నేతలపై ఘాటు విమర్శలు, అనుచిత పదాలతో దూషణలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా తమ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టును కాల్చేయటంతో పార్టీ సీరియస్ అయ్యింది. పార్టీని దిక్కరిస్తున్నందుకు మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు.. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు పంపించింది.


కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై తీన్మార్ మల్లన్న ఘాటుగా స్పందించారు. పార్టీల నేతలపై ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎందుకు నోటీసులు ఇవ్వాలని ప్రశ్నించారు. "పార్టీ ఏమన్నా.. మీ అయ్య జాగీరా.. కాంగ్రెస్ పార్టీ మాది.. బీసీలది. కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్న మీరు పెత్తనం చేసుకుంటా నన్ను బెదిరించాలని.. దమ్కీలు ఇస్తామంటే నడవదు. బీసీలకు అన్యాయం జరిగితే జనాలు పండబెట్టి తొక్కుతరు." అంటూ ఘాటు కామెంట్లే చేశారు.


"కులగణనపై ఏ బీసీ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతలేడు. అలాంటి ఎమ్మెల్యేల పని అయిపోయింది. వారి పని జనమే చూసుకుంటారురు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు కులగణన సర్వే నివేదికను తప్పు అని చెప్పకుండా పారదర్శకమైందంటూ చెప్పడం దుర్మార్గం. కులగణన సర్వే అగ్రకుల సర్వే. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు కాపాడుకోవడానికి జానారెడ్డి ఆడిన డ్రామా. దీనికి ఎలాంటి అధికారికత, ప్రమాణికతలు లేవు. అంటూ తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


"అంబర్‌పేట తులసీనగర్ కాలనీలో 20 వేల మంది ఉంటే అక్కడ సర్వేనే జరగలేదని.. గోల్నాకాలో, మల్కాజ్‌గిరిలో కూడా అదే పరిస్థితి. అందుకే ఇది ఫేక్ సర్వే. అన్ని దొంగ లెక్కలే. మా ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసే సర్వే రిపోర్టును దగ్ధం చేస్తాం. కులగణన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలు." అని తీన్మార్ మల్లన్న తెలిపారు.


"జానారెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటిస్తున్నాం. ఖబడ్ధార్. నీవు చేసిన మోసం, కుట్రనే ఇదంతా. రాహుల్ గాంధీ పార్లమెంటులో చెప్పిన మాటలకు విరుద్ధంగా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేసి 40 లక్షల బీసీలను గల్లంతు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కావాలి.. టికెట్లు కాదు. కాంగ్రెస్ పార్టీని పదికాలల పాటు కాపాడుకోవాలన్న ఆలోచన రాష్ట్ర నాయకత్వానికి లేదు." అని తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa