ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 08:07 PM

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త వినిపించింది. జనవరి 26వ తేదీన లాంఛనంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం కింద.. ఎకరానికి రూ.12 వేల పెట్టుబడి సాయాన్ని.. ఆ రోజు ఎంపిక చేసిన గ్రామాల్లోని అన్నదాతలకే అందించింది. అయితే.. మిగతా రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ.. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శుభవార్త వినిపించారు. ఈరోజు (ఫిబ్రవరి 05) నుంచి రైతు భరోసా డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలోకి ఇవ్వాళ్టి నుంచి రైతుభరోసా డబ్బులు జమ చేస్తున్నట్లుగా తెలిపారు. మొదటగా.. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు అంటే.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17.03 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమవుతాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.


అయితే.. జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి సర్కార్.. మార్చి 31 నాటికి అన్నదాతల అకౌంట్లలోకి పెట్టుబడి సాయాన్ని జమ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొంది. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా.. ఇప్పటికే పలు జిల్లాల్లో రైతు భరోసా డబ్బుల పంపిణీ నిలిచిపోయింది. ఈ క్రమంలో.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రైతు భరోసా లబ్ధిదారులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.


జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో రైతు భరోసా పథకంతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పథకాలు ప్రారంభించిన తర్వాతి రోజు (జనవరి 27) నుంచే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమయ్యే ప్రక్రియ మొదలైంది. ఆరోజు వేసిన వారికి కాకుండా.. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. అయితే.. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావటంతో కొన్ని ప్రాంతాల్లో రైతు భరోసాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాగా.. తిరిగి రైతు భరోసా డబ్బుల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa