ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈటల రాజేందర్‌కు గులాబీ బాస్ కేసీఆర్ ఫోన్...?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 08:14 PM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు ఫోన్ చేశారని.. మళ్లీ కలిసి పని చేయాలని పిలిచారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై ఈటల రాజేందర్ స్పందిస్తూ.. ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఈటల తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ తనకు ఫోన్ చేసి పిలిచారంటూ చక్కర్లు కొడుతున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. తానంటే గిట్టని వారు.. సోషల్ మీడియాలో ఉండే కొందరు సైకోలు, శాడిస్టులు మాత్రమే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఈటల ఘాటుగా స్పందించారు. ఇందులో ఎలాంటి నిజం లేదని ఈటల రాజేందర్ ఖండించారు.


తాను చాలా కాలంగా బీఆర్ఎస్, కేసీఆర్ విషయంలో తన స్పష్టమైన అభిప్రాయాన్ని చెబుతూనే ఉన్నప్పటికీ.. కొంతమంది కావాలనే పనిగట్టుకుని మరీ.. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది పూర్తిగా బాధ్యత లేని వ్యక్తుల శాడిజమని అభిప్రాయపడ్డారు. తనపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపైనే త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటనని ఈటల రాజేందర్ హెచ్చరించారు.


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈటల రాజేందర్.. కీలక విషయాలు వెల్లడించారు. మళ్లీ కేసీఆర్ పిలిస్తే వెళ్తారా అంటూ.. జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఈటల తనదైన శైలిలో స్పందించారు. తామంతా బాధ్యత ఉన్న రాజకీయ నేతలుగా చెప్పుకొచ్చిన ఈటల.. ఇదేమీ పిల్లల ఆట కాదన్నారు. వాళ్ల పార్టీ వాళ్లది, తమ పార్టీ తమదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే తన లక్ష్యమని ఈటల స్పష్టం చేశారు.


గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రోజులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో సరైన సమాచారం లేదని పేర్కొన్న ఈటల రాజేందర్.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ జరిపిన కులగణనలో కూడా శాస్త్రీయత లేదంటూ విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీ-ఈ గ్రూప్ తీసుకొచ్చారన్నది తప్పుడు వాదన అని.. నిజానికి ఆతకుముందే కొన్ని ముస్లిం కులాలు బీసీ-బీ గ్రూప్‌లో ఉన్నాయని ఈటల వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిష్పక్షపాత దృష్టి, చిత్తశుద్ధి, సరైన ప్రణాళిక ఏమీ లేదన్నారు.


ఒక కమిషన్ ఏర్పాటు చేసి.. దానికి చట్టబద్ధత కల్పించి, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కులాలను గుర్తించాకే జనగణన చేయాలని ఈటల రాజేందర్ సూచించారు. ఇలాంటివేవీ చేయకుండా కులగణన పేరిట ప్రజలను కాంగ్రెస్ సర్కార్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. అవగాహన లేనివారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని.. ఇది ప్రజలకు ఎటువంటి మేలు చేసే కార్యక్రమం కాదని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa