ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాళ్లందరి ఖాతాల్లోకి డబ్బులు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2025, 07:48 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపికబురు వినిపించింది. 3 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం (ఫిబ్రవరి 28న) ఉదయం ప్రజాభవన్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, డైరక్టర్ గోపీ సహా ఆర్థిక, వ్యవసాయ శాఖల అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. కీలక ఆదేశాలు జారీ చేశారు.


మూడెకరాలలోపు రైతు భరోసా లబ్ధిదారుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలు గ్రామ కూడళ్లలో అందరికీ కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని భట్టి సూచించారు. అనంతరం.. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి భట్టి విక్రమార్క బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయరంగానికి సంబంధించిన బ్యాంకింగ్ సేవలు, రుణాల మంజూరుపై చర్చించారు. రైతులకు అందుతున్న ఆర్థిక సాయం, పథకాల అమలు పురోగతిపై భట్టి విక్రమార్క సమీక్షించారు.


ఈ సమావేశంలో మాట్లాడిన భట్టి విక్రమార్క తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని.. ఇందులో బ్యాంకర్లు కీలక భాగస్వాములని పేర్కొన్నారు. స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐల అడ్వాన్స్‌మెంట్ ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను, ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా, శాంతి భద్రతలతో.. మంచి వాతావరణం కల్పించి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా దావోస్‌లో 1.80 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్టు గుర్తుచేశారు.


వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడమే కాదు.. చేసి చూపించామని భట్టి విక్రమార్క తెలిపారు. ఒక్క వ్యవసాయ రంగానికే రూ.52 వేల కోట్లు కేటాయించినట్టు భట్టి పేర్కొన్నారు. 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద సుమారు రూ.22 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డుగా అభివర్ణించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులతో పాటు బ్యాంకర్లకు కూడా మేలు జరిగిందని, సింగిల్ ఖాతా ద్వారా రూ.22 వేల కోట్లు బ్యాంకుల్లో జమయ్యాయని.. సింగిల్ స్ట్రోక్‌తో పెద్ద మొత్తంలో బ్యాంకర్లకు రికవరీ జరిగిందని బ్యాంకర్లు ప్రభుత్వాన్ని అభినందించాలన్నారు.


రైతు భరోసా పథకం కింద ఇప్పటికే రూ.11,500 కోట్లు, రైతు బీమా కింద రూ.1,500 కోట్లు, రైతులకు ఉచిత విద్యుత్ పథకం కింద సబ్సిడీ మొత్తం రూ.11 వేల కోట్లు, సన్నవడ్లకు బోనస్‌గా రూ.1,800 కోట్లు, ఇవి కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు ప్రయోజనం చేకూరుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa