దేశ రక్షణలో తెలంగాణదే ప్రధాన పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం (ఫిబ్రవరి 28న) రోజున హైదరాబాద్లోని గచ్చిబౌలిలో డిఫెన్స్ ఎగ్జిబిషన్ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నేటి (ఫిబ్రవరి 28) నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ డిఫెన్స్ ఎగ్జిబిషన్లో.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని వివరించనున్నారు. త్రివిధ దళాలపై యువతకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. దేశ రక్షణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రక్షణ శాఖకు సంబంధించి విభాగాలు, పరిశ్రమలు హైదరాబాద్లో ఉన్నాయని తెలిపారు. సైన్స్ ఎగ్జిబిషన్తో నిత్యం లక్షలాది మందికి అవగాహన కల్పిస్తున్నారని రేవంత్ రెడ్డి వివరించారు.
సంప్రదాయ ఇంజనీరింగ్కు తోడ్పాటును ఇచ్చేందుకు డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశాన్ని కాపాడంలో రక్షణ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని.. అదేవిధంగా దేశ రక్షణ బాధ్యత యువతపై ఉందని తెలిపారు. మిస్సైల్స్ తయారీ చేసే ప్రముఖ పరిశ్రమలైన డీఆర్డీఎల్, బీడీఎల్, డీఆర్డీవో, మిథానీ లాంటి కంపెనీలు తెలంగాణలోనే ఉండటం సంతోషకరమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్నాథ్ సింగ్.. నోబెల్ అవార్డు గ్రహీత సర్ సీవీ రామన్.. ఫిబ్రవరి 28వ తేదీనే రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారని గుర్తు చేసిన రాజ్నాథ్ సింగ్.. ఆయన గౌరవార్థమే ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకోనున్నామని వివరించారు. తాను కూడా సైన్స్ విద్యార్థినే అని.. రాజకీయాల్లోకి రాకముందు కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా కూడా పనిచేశానని రాజ్నాథ్ వివరించారు. మానవ పరిణామాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు లోతుగా అధ్యయనం చేయాలని రాజ్నాథ్ సూచించారు.
యువతి యువకులు శాస్తవ్రేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని రాజ్నాథ్ సూచించారు. గ్లోబల్ లీడర్ షిప్లో యువతదే కీలక పాత్ర అని.. సైన్స్ టెక్నాలజీలో వచ్చే మార్పుల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రక్షణ శాఖ చారిత్రాత్మక విజయాల్లో కేంద్రం విశేష పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ శాఖకు గత కొన్నేళ్లుగా మంత్రిగా ఉండటం తన అదృష్టంగా చెప్పుకొచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఒరవడిని భారతదేశం సృష్టిస్తోందని రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa