ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీ.. ఓరుగల్లు దశ తిరిగినట్టే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2025, 07:11 PM

వరంగల్ వాసులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. వరంగల్ రూపు రేఖలు మార్చేయనున్న మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు.. కేంద్ర సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో.. మామునూరు ఎయిర్ పోర్టు‌ నిర్మాణానికి అనుమతి లభించినట్టయింది. కేవలం.. రన్ వే నిర్మాణానికి అవసరమైన భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ సేకరించి ఇస్తే చాలు.. వెంటనే ఎయిర్ పోర్టు పనులు ప్రారంభించనున్నారు. అయితే.. ఈ మామునూరు ఎయిర్ పోర్ట్ కోసం ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ పూర్తి కాగా.. మరో 253 ఎకరాలు ప్రభుత్వం సేకరించనుంది. ఈ భూసేకరణ కోసం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రూ.205 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభించేశారు.


మరోవైపు.. తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మరో 6 చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలని తలచిన ప్రభుత్వం.. ఇందులో భాగంగా మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది.


తెలంగాణలో విమానాశ్రయాలు నిర్మించతలపెట్టిన ఆరు ప్రాంతాలపై ఏఏఐ అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై సుముఖత వ్యక్తం చేస్తూ.. ఇటీవల ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ మేరకు తొలి దశలో వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఏఏఐ అధికారులతో కొద్ది నెలలుగా సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగానే.. తాము సూచించిన అదనపు భూమిని కేటాయిస్తే నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్టు ఏఏఐ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో.. భూసేకరణ చివరి దశకు రావడంతో కేంద్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.


అయితే.. వరంగల్ జిల్లా మామునూరులో, హైదరాబాద్ చివరి నిజాం 706 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్ స్ట్రిప్ నిర్మించారు. 1930లో భారత్- చైనా యుద్ధ సమయంలో ప్రభుత్వ విమానాల హ్యాంగర్‌గా మామునూరు ఎయిర్ స్ట్రిప్‌ను ఉపయోగించుకున్నారు. అప్పట్లో అతిపెద్ద రన్ వేగా కూడా మామునూరు విమానాశ్రయం గుర్తింపు పొందింది. అయితే.. ప్రస్తుతం దీనికి అదనంగా మరో 253 ఎకరాలు సేకరించి.. ఎయిర్‌పోర్టుగా నిర్మించతలపెట్టారు. కాగా.. ఈ విమానాశ్రయం నిర్మాణానికి సుమారుగా.. రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి సర్కార్ భూమి సేకరించి ఇస్తే చాలు.. మిగతా నిర్మాణ ఖర్చులు మొత్తం కేంద్రమే భరించనుంది.


మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణ తొలి దశను డిసెంబరులోగా పూర్తి చేసి దేశీయ విమానాల రాకపోకలను ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తోంది. కేరళలోని ప్రఖ్యాత కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో మామునూరు ఎయిర్‌పోర్టును నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వరంగల్ వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa