ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 03:47 PM

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలతో తెలంగాణ బీజేపీ నాయకుల్లో మరోమారు వర్గవిభేదాలు బయటపడ్డాయి. తొందర్లోనే తెలంగాణకు కొత్త బిజెపి అధ్యక్షుడు వస్తారని రాజాసింగ్ అన్నారు.అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరని నిర్ణయించేది ఎవరు? స్టేట్ పార్టీనా.. సెంట్రల్ పార్టీనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర నాయకులు అధ్యక్షుడిని డిసైడ్ చేస్తే మాత్రం రబ్బర్ స్టాంప్ లాంటి వ్యక్తి స్టేట్ ప్రెసిడెంట్ అవుతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. జాతీయ నాయకులు స్టేట్ ప్రెసిడెంట్ను నియమిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం చెప్పారు.గతంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వారు బీజేపీ పార్టీలో వారి సొంత వర్గాలు తయారు చేసుకున్నారని అవి పార్టీకి నష్టం కలిగించాయని అన్నారు. సీనియర్ బీజేపీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం కష్టపడి జైలుకు వెళ్లారు. అలాంటి వారిని గతంలో పక్కన పెట్టారని బీజేపీ అధిష్టానంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం నియమించబోయే అధ్యక్షుడు కూడా గ్రూప్ పాలిటిక్స్ ప్రొత్సహిస్తే పార్టీకి చాలా నష్టమని ఆయన అన్నారు.పార్టీలో మంచి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే, ఎంపీల చేతులు కట్టి పక్కన పడేస్తున్న పరిస్థితులు ఉన్నాయని గోషామహాల్ ఎమ్మె్ల్యే అన్నారు. అలా కాకుండా పార్టీలో బాగా పని చేసే సీనియర్ నాయకులకు అధ్యక్ష పదవి ఇచ్చి ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణ బిజెపి కొత్త ప్రెసిడెంట్ నియమించిన తర్వాత.. ఆయన ముఖ్యమంత్రితోనే బ్యాక్ డోర్ సీక్రెట్ మీటింగ్ పెట్టకూడదని అన్నారు. సీనియర్ నాయకులకే అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన అధిష్టానానికి సూచించారు. బీజేపీ అంటే హిందూ పార్టీ అని.. ధర్మ కోసం పోరాడే నాయకులను, కార్యకర్తలను పార్టీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa