ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేం ఒప్పుకోం.. డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 05:45 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశంలో జరుగుతున్న డీలిమిటేషన్ అంశంపై మరొకసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచవద్దని.. అందుకోసం రాష్ట్రాలలోనే అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలని సూచించారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ పద్ధతిని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకే పార్టీ ఆహ్వానించిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ.. జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు అనుకూలంగా లేదని స్పష్టం చేశారు.


అందులో భాగంగా ఆయన.. మేము ఈ ప్రక్రియను అంగీకరించమని అన్నారు. ఈ విధానం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. జనాభా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే.. దక్షిణ భారతదేశం రాజకీయంగా వెనుకబడిపోతుందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. సాధారణంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు కేంద్రం నుంచి తక్కువ నిధులు పొందుతున్నాయన్నారు. తమిళనాడు ఒక్క రూపాయి చెల్లిస్తే కేవలం 26 పైసలు మాత్రమే తిరిగి వస్తుంది.


అలాగే.. తెలంగాణ కేవలం 42 పైసలు మాత్రమే పొందుతుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. డీలిమిటేషన్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వబడుతుందని.. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు.. మరింత ఆధిపత్యాన్ని సాధిస్తాయన్నారు. ఎందుకంటే.. జనాభా ప్రకారం అక్కడ ఎక్కువగా ఉంటారని.. దీని వల్ల ఎక్కువ ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉండటంతో.. తక్కువ ఎంపీ స్థానాలు వచ్చే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాలు కూటమిగా కలిసి ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాలన్నారు.


మరో 25 ఏళ్లు సీట్లను పెంచొద్దు..


ప్రతీ రాష్ట్రంలో 33 శాతం రిజర్వేషన్లు.. ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచడం, రాష్ట్రాల జాబితాలో సమానత్వాన్ని సాధించడం.. అనే అంశాలను కేంద్రం ముందు ఉంచడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. 1976, 2001 సంవత్సారాల్లో కూడా లోక్‌సభ సీట్లు పెంచకుండా.. డీలిమిటేషన్ చేపట్టారని.. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కూడా లోక్‌సభ సీట్లు పెంచకుండా చూడాలన్నారు.


డీలిమిటేషన్ వల్ల రాజకీయ అసమానత్వం అనేది రాష్ట్రాల మధ్య వస్తుందన్నారు. లోక్‌సభ సీట్లను మరో 25 ఏళ్లు పెంచకూడదన్నారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. చెన్నై వేదికగా జరిగిన ఈ సదస్సుకు పలు రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. డీలిమిటేషన్ పై రెండో సమావేశం హైదరాబాద్‌లో నిర్వహిస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలియజేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa