ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిల్డర్లకు అండగా ఉంటాం,,,,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 04:32 PM

నిర్మాణ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. బిల్డర్ల సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. బిల్డర్లకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం నగరంలో నిర్వహించిన సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ వార్షికోత్సవానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధికి బిల్డర్లు కృషి చేయాలని ఆయన కోరారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని ఆయన గుర్తు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్‌రోడ్డు, కృష్ణా- గోదావరి జలాల తరలింపు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. ఈ అభివృద్ధిని ప్రభుత్వం మరింత ముందుకు తీసుకుపోతుందన్నారు. ప్రజారవాణా కోసం మెట్రోను అభివృద్ధి చేస్తున్నామని.. హైదరాబాద్‌ను మరో సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాతమని చెప్పారు.


ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలంగా ఫోర్త్ సిటీ పేరుతో ఫ్యూచర్ సిటీని తీసుకువస్తోందన్నారు. మూసీ నదిని శుభ్రం చేసి, దాని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. బిల్డర్లకు మరింత లాభాలు వచ్చేలా చూస్తామని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, మరిన్ని భవనాలు నిర్మించాలని ఆయన బిల్డర్లను కోరారు. ప్రభుత్వంలో బిల్డర్లు ఎప్పటికీ భాగస్వాములుగా ఉంటారని, ప్రభుత్వ అభివృద్ధిలో వారి పాత్ర ఎప్పటికీ ఉంటుందని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం బిల్డర్లకు వెన్నుదన్నుగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


కాగా, ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగమనాన్ని ఎదుర్కొంటోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అధిక ధరలు, ఎన్‌ఆర్ఐ పెట్టుబడులు తగ్గడం, ఆర్థిక అనిశ్చితి వంటి కారణాల వల్ల అమ్మకాలు తగ్గాయని అంటున్నారు. అయితే, దీర్ఘకాలికంగా వృద్ధికి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బిల్డర్లకు భరోసా ఇచ్చేలా మంత్రి ఉత్తమ్ కీలక కామెంట్స్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa