తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం కాగానే వరుణుడు ఎంట్రీ ఇచ్చి భారీ వర్షాలతో హైదరాబాద్ సహా జిల్లాలను కుదిపేస్తున్నాడు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో.. రైతులకు భారీ నష్టం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. సాయంత్రం వేళల్లో ఈదురు గాలులు, వడగండ్ల వానలు కురుస్తున్నాయి. కాగా.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏప్రిల్ 19న వర్ష సూచన:
ఈరోజు (ఏప్రిల్ 19) రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏప్రిల్ 20న కూడా వర్షాలు:
రేపు (ఏప్రిల్ 20) కూడా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రానున్న మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు:
ఇదిలా ఉండగా.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అధిక ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ ఉత్తర మరియు ఈశాన్య జిల్లాలకు ఆరెంజ్ మరియు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa