ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి తన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ వర్గాల్లో దుమారం రేపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన దానం నాగేందర్.. మొన్నటివరకు గులాబీ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు రూట్ మార్చేసి.. కేసీఆర్ మీద కాస్త పాజిటివ్గా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ను పొగిడి.. హస్తం నేతలను ఆశ్చర్యపరిచిన దానం.. ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేసి అవాక్కయ్యేలా చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో నిర్వహించబోయే సభ విజయవంతం అవుతుందని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను చూడటానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. "కేసీఆర్ సభకు భారీగా జనం వస్తారు. ప్రజలు ఆయనను చూడటానికి ఆసక్తిగా ఉన్నారు." అని దానం నాగేందర్ స్పష్టం చేశారు. కేసీఆర్ సభకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని దానం నాగేందర్ అంచనా వేశారు.
మరోవైపు.. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్ వివాదంపై కూడా దానం నాగేందర్ స్పందించారు. స్మితా సబర్వాల్ రీట్వీట్ చేయటంలో తప్పేమీ లేదన్నారు.. ఆమె వాస్తవాన్నే ట్వీట్ చేశారని దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. "స్మితా సబర్వాల్ ట్వీట్లో తప్పేం లేదు. ఆమె వాస్తవాన్నే ట్వీట్ చేశారు. ఆమె ప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసినట్లు లేదు. ఇదే విషయంలో సీఎస్ శాంతి కుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేస్తుందని అనుకుంటున్నా." అని దానం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కాగా.. ఈ రెండు విషయాల్లో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పలు చర్చలకు దారితీస్తున్నాయి. కేసీఆర్ సభపై దానం చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా.. స్మితా సబర్వాల్ ట్వీట్పై చేసిన కామెంట్లు.. అధికార పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. దానం నాగేందర్ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa