తెలంగాణ రాష్ట్రంలో ఎండలు భీకరంగా విజృంభిస్తున్నాయి. నిప్పుల కొలిమిలా మారిన వాతావరణం ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. భానుడి భగ భగలకు జనాలు ఎండదెబ్బ తగిలి.. పిట్టల్లా రాలిపోతున్నారు. బుధవారం (ఏప్రిల్ 24న) ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు వడదెబ్బకు గురై మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విషాదకర ఘటనలతో రాష్ట్రమంతటా ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా హెచ్చరికలు మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో.. తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా, చాలా జిల్లాల్లో రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి ప్రజలు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే, వాతావరణ శాఖ కొంత ఊరటనిచ్చే సూచనలు కూడా చేసింది. ఉత్తర, దక్షిణ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అయినప్పటికీ, అప్పటివరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో బుధవారం (ఏప్రిల్ 24) రోజున నమోదైన ఉష్ణోగ్రతలు భయానకంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 3.6 డిగ్రీలు ఎక్కువ కావడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 44.3 డిగ్రీలు, మెదక్లో 43.4 డిగ్రీలు, రామగుండంలో 42.8 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
వడదెబ్బతో మృతి చెందిన వారి వివరాలు..
నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఆష్టా గ్రామానికి చెందిన గంగారాం (55)
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేటకు చెందిన కళ్లెం రమేశ్ (54)
ఖమ్మం జిల్లా మధిర పట్టణం రామనాథం వీధికి చెందిన శేషాచారి (80)
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్కాలనీకి చెందిన పుల్లూరి రమేష్కుమార్ (37)
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన రవళి (35)
హైదరాబాద్ చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వేస్టేషన్ ఆరో ప్లాట్ఫాం ప్రాంతంలో గుర్తు తెలియని ఓ యాచకుడు (70)
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనక కాశీరాం (42)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa