తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత వ్యవహారం సంచలనంగా మారింది. కవిత.. కేసీఆర్కు రాసిన లేఖతో వివాదం మొదలు కాగా.. తాజాగా చిట్ చాట్లో చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది. కవిత వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో వాడీవేడీ చర్చ జరుగుతుంది. ఆమె పార్టీ మారుతుందంటూ జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త ఆఫీసు ప్రారంభించింది. ఆవివరాలు..
ఎమ్మెల్సీ కవిత.. కొత్త ఆఫీస్ ప్రారంభించారు. జాగృతి కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను ఈ ఆఫీసును వినియోగించనున్నారు. ఆమె తన నివాసం పక్కనే కొత్త జాగృతి కార్యాలయాన్ని.. ఏర్పాటు చేశారు. అద్దె భవనంలో ఈ ఆఫీస్ ప్రారంభించనున్నారని సమాచారం. నేడు శనివారం సాయంత్రం 4:00 సమయంలో కవిత జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్లో ఈ కార్యక్రమం జరగనుంది. దీనితో పాటు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు కవిత.
మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ.. జూన్ 4న ఇందిరాపార్క్లో ధర్నా చేయాలని కవిత నిర్ణయించుకున్నారు. అప్పుడే మీడియా సమావేశంలో కొత్త ఆఫీసు ప్రారంభం వ్యవహారంపై స్పందించే అవకాశం ఉంది.
లేఖ వ్యవహారంపై కవిత స్పందిస్తూ పార్టీ బలోపేతం కోసమే లేఖ రాశానని చెప్పుకొచ్చింది. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తాను జైల్లో ఉన్న సమయంలోనే బీఆర్ఎస్, బీజేపీ విలీనం గురించి ప్రతిపాదన వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు తాను అంగీకరించలేదని.. అవసరమైతే మరో ఏడాది జైల్లో ఉంటానని చెప్పానని తెలిపారు. అలానే పార్టీలో ఉన్న వారే తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై పడి విమర్శలు చేసి.. తప్పుడు వార్తలు, పెయిడ్ వార్తలు రాయిస్తే ఏం వస్తుందని కవిత అసహనం వ్యక్తం చేశారు. ఇంటి ఆడబిడ్డతోని ఇలానే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. అంతేకాక రాష్ట్రంలోని ఓ ప్రతిక కావాలని తనపై తప్పుడు వార్తలు రాస్తుందని తెలిపారు. తన మీద కుట్రతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలోని ఎంపీల్లో కొందరు కోవర్టులున్నారంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా కొత్త ఆఫీస్ ప్రారంభించి మరింత రాజకీయ దుమారం లేపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa