హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ఎదుర్కొంటున్న పలు సమస్యల పట్ల మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "పాతబస్తీ ఏం పాపం చేసింది అంటూ ప్రభుత్వ అధికారుల తీరును, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. పాతనగరంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని, సరైన నివాస వసతులు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.పాతబస్తీలో నెలకొన్న పరిస్థితులపై ఒవైసీ మాట్లాడుతూ, "పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో రోజురోజుకూ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఇరుకైన రహదారులు, భారీ ట్రాఫిక్తో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా, అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో కూడా సిగ్నల్ లైట్లు పనిచేయడం లేదు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు" అని అసహనం వ్యక్తం చేశారు.రోడ్ల వెంట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని ఖాళీ చేయిస్తున్నారని అసదుద్దీన్ ఆరోపించారు. "ఇలాంటి చిరు వ్యాపారాలపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వారికి ఉపాధి దూరం చేస్తే దోపిడీలు, దొంగతనాలు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. వరుస అగ్నిప్రమాదాలు, నివాస సమస్యలు, పారిశుధ్య లోపం వంటి అంశాలపై తక్షణమే దృష్టి సారించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa