ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ యాసను హేళన చేసిన వ్యక్తికి నంది అవార్డు ఇవ్వడాన్ని నిరసించామని వెల్లడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 26, 2025, 07:26 PM

తెలంగాణ ఉద్యమ సమయంలో మన యాసను అవహేళన చేసిన వ్యక్తికి నంది అవార్డు ఇవ్వడాన్ని నిరసించిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన 'లీడర్' శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలని తాము భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథాను మార్చుకున్నట్లు ఆమె వెల్లడించారు.మన సంప్రదాయాలు, కట్టుబాట్లపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఎల్లప్పుడూ కొత్తగా ఆలోచిస్తేనే సంస్థలు మనుగడ సాగిస్తాయని, ఎవరూ కూడా నాయకత్వ లక్షణాలతో జన్మించరని ఆమె అన్నారు. నేర్చుకుంటూ, మారుతూ ముందుకు వెళ్లేవారే నాయకులు అవుతారని, పాత పద్ధతుల్లో కొనసాగేవారు నాయకులు కాలేరని ఆమె స్పష్టం చేశారు.సామాజిక స్పృహ కలిగిన రాష్ట్రాలలో తెలంగాణ 11వ స్థానంలో ఉందని ఒక సర్వేలో తేలిందని కవిత గుర్తు చేశారు. తోటివారి గోప్యతకు, మర్యాదకు భంగం వాటిల్లకుండా విమర్శలు చేయడం నేర్చుకోవాలని ఆమె సూచించారు. ఇతరులను దూషిస్తున్నారంటే వారి వద్ద తగినంత సమాచారం లేదని అర్థమని ఆమె అన్నారు. మహాత్మా గాంధీ ఎప్పుడూ ఎంపీగానో, ఎమ్మెల్యేగానో లేరని, కానీ ఆయన ఇప్పటికీ మనకు గుర్తుంటారని ఆమె వ్యాఖ్యానించారు.తెలంగాణ జాగృతి నుంచి గాంధీగిరికి కొత్త భాష్యం చెప్పాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. సాంస్కృతిక నేపథ్యం లేని ఏ జాతి కూడా మనుగడ సాగించలేదని ఆమె అన్నారు. సాంస్కృతిక నేపథ్యం లేని జాతి, పునాది లేని భవనం లాంటిదని ఆమె పేర్కొన్నారు.తెలంగాణ జాతికి గొప్ప నేపథ్యం ఉందని, దానిని పరిరక్షించేందుకే జాగృతి ఉందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రం కోసం పనిచేశామని, ఇప్పుడు అభివృద్ధి కోసం జాగృతి కృషి చేస్తోందని ఆమె తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే జాగృతి చూస్తూ ఊరుకోదని ఆమె హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa