ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కామారెడ్డి జిల్లాలో.. 181.4 కిలోమీటర్ల మేర కొత్త రహదారులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 26, 2025, 06:59 PM

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రోడ్లు ఆధునీకరణలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్‌) విధానం ద్వారా ఈ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,000 కిలోమీటర్ల మేర రోడ్లను ఈ నూతన పద్ధతిలో మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. కామారెడ్డి జిల్లాలో 181.4 కిలోమీటర్ల రహదారులకు అన్ని హంగులు కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. మరో నెల రోజుల్లో ఈ పనులకు సంబంధించిన టెండర్లను ఖరారు చేయనున్నారు.


హ్యామ్‌ విధానం రహదారుల నిర్మాణంలో నాణ్యతను.. దీర్ఘకాలిక నిర్వహణను నిర్ధారిస్తుంది. ఈ పద్ధతిలో రోడ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం మొత్తాన్ని ప్రభుత్వం ముందుగా భరిస్తుంది. మిగిలిన 60 శాతం నిధులను కాంట్రాక్టర్స్ బ్యాంకుల ద్వారా రుణంగా పొందుతాడు. ఈ మొత్తం నిధులతోనే రోడ్లను నిర్మిస్తారు. కాంట్రాక్టర్ బ్యాంకు నుండి తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం 15 సంవత్సరాల కాలంలో తిరిగి చెల్లిస్తుంది.


ముఖ్యంగా.. ఈ విధానం ప్రకారం కాంట్రాక్టర్ నిర్మించిన రహదారులను 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా వహిస్తాడు. గతంలో నిర్వహణ బాధ్యతలు కేవలం 5 సంవత్సరాల వరకు మాత్రమే ఉండటంతో.. కొందరు నాసిరకం పనులు చేసి చేతులు దులుపుకునేవారు. హ్యామ్‌ విధానం ఈ లోపాన్ని సరిదిద్ది, రహదారుల నాణ్యతకు, దీర్ఘకాలిక మన్నికకు హామీ ఇస్తుంది. ప్రస్తుతం.. ఈ విధానం ద్వారా జాతీయ రహదారుల నిర్మాణాలు కూడా చేపట్టబడుతున్నాయి. రాష్ట్రంలో ఏటా కొన్ని రహదారులను ఈ పద్ధతిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


కామారెడ్డి జిల్లాలో రహదారి ప్రాజెక్టుల వివరాలు..


కామారెడ్డి జిల్లాలో ఈ హ్యామ్‌ విధానంలో రోడ్లు అభివృద్ధి చేయబడే ప్రాంతాలు క్రింద వివరించబడ్డాయి. కామారెడ్డి నియోజకవర్గంలో.. కామారెడ్డి నుంచి తుంపల్లి రోడ్డు వరకు: 19.80 కిలోమీటర్లు. పాత జాతీయ రహదారి నుంచి బూర్గుపల్లి వరకు: 8 కిలోమీటర్లు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో.. మొత్తం 76.1 కిలోమీటర్ల మేర రహదారులను ఆధునీకరిస్తారు. ఎల్లారెడ్డి నుంచి తుంపల్లి వరకు 8 కిలోమీటర్లు. బస్వన్నపల్లి నుంచి గుండారం మీదుగా బూర్గుపల్లి వరకు.. 15.30 కిలోమీటర్లు. కృష్ణాజివాడి నుంచి తాడ్వాయి, ఎర్రపహాడ్ మీదుగా ఎల్లారెడ్డి వరకు.. 36.80 కిలోమీటర్లు. బాన్సువాడ నుంచి ఉప్పల్‌వాయి రోడ్డు వరకు.. 30.30 కిలోమీటర్లు నిర్మించనున్నారు.


బాన్సువాడ నియోజకవర్గంలో..


దుర్కి నుంచి బీర్కూర్‌ వరకు.. 9 కిలోమీటర్లు. బాన్సువాడ నుంచి ఉప్పల్‌వాయి వరకు.. 10 కిలోమీటర్లు. బోర్లం నుంచి దుర్కి వరకు.. 8.2 కిలోమీటర్లు. బాన్సువాడ నుంచి బిచ్కుంద వరకు.. 4 కిలోమీటర్ల వరకు రోడ్లను నిర్మించనున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో.. బాన్సువాడ నుంచి బిచ్కుంద వరకు 28 కిలోమీటర్లు, అన్నాసాగర్ నుంచి పిట్లం వరకు 10.5 కిలోమీటర్లు, మద్దెల చెరువు నుంచి పిట్లం వరకు 19.4 కిలోమీటర్ల వరకు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులు కామారెడ్డి జిల్లాలో రవాణా వ్యవస్థను గణనీయంగా మెరుగుపరచి, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తాయని ఆశిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa