రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను (స్పెషల్ ట్రైన్స్) ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలో.. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అనేక రైల్వే స్టేషన్లలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల కారణంగా, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా కొన్ని రైళ్లను ఇతర స్టేషన్ల నుంచి నడుపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ అధికంగా ఉండటంతో, కొన్ని రైళ్లను చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో.. చర్లపల్లి నుంచి నడిచే ఒక ప్రత్యేక వీక్లీ రైలును పొడిగిస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం, చర్లపల్లి - పాట్నా మధ్య నడిచే ప్రత్యేక వీక్లీ రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపారు. (03253) పాట్నా - చర్లపల్లి మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలు.. ఇది ప్రతి సోమవారం, బుధవారం నాడు నడుస్తుంది. ఈ రైలును ఈ నెల ఆగస్టు 4 నుంచి ఆగస్టు 29 వరకు జహనాబాద్ వరకు పొడిగించి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
(07255) చర్లపల్లి - పాట్నా మధ్య నడిచే వీక్లీ ఎక్స్ప్రెస్: ఈ రైలు ప్రతి బుధవారం నడుస్తుంది. దీనిని ఈ నెల ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 1 వరకు పొడిగిస్తున్నారు.
(07256) చర్లపల్లి - పాట్నా మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలు.. ఇది ప్రతి శుక్రవారం నడుస్తుంది. దీనిని ఈ నెల ఆగస్టు 8 నుంచి ఆగస్టు 26 వరకు పొడిగించి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం..
సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, నాగ్పూర్, గోండియా, దర్గ్, రాయ్పూర్, బిలాస్పూర్, జార్సీగూడ, రూర్కెలా, హతియా, రాంచి, బొకారో, గోమో, కొడెర్మా, జయా, జెహనాబాద్ వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లకు ఆగే సౌకర్యం కల్పించారు. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రయాణికులకు కూడా లబ్ధి చేకూరుతుంది. భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించాయి. ఈ పథకం కింద, రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చెందుతున్న రైల్వే స్టేషన్లలో.. సికింద్రాబాద్, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లతో పాటు, వరంగల్, మహబూబ్నగర్, నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాచలం రోడ్డు, వికారాబాద్ వంటి ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లలో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆధునిక వెయిటింగ్ హాల్స్, మెరుగైన ప్రవేశ మార్గాలు, ప్లాట్ఫామ్ సౌకర్యాలు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, ఆహార స్టాల్స్, డిజిటల్ డిస్ప్లే బోర్డులు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఈ అభివృద్ధి పనులు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా, ఆయా ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడతాయని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa