తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో ప్రస్తుతం నకిలీ అటెండెన్స్ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది. పారదర్శకత, జవాబుదారీతనం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ యాప్ను కొందరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు మోసం చేయడానికి ఉపయోగించడం అధికారులను విస్మయానికి గురిచేసింది. విధులు సరిగా నిర్వర్తించకుండా.. గ్రామాలకు వెళ్లకుండానే, తప్పుడు ఫోటోలు, ఫేక్ వివరాలు సమర్పంచడం.. అందులో ఏకంగా ముఖ్యమంత్రి ఫోటోలు, ఖాళీ కుర్చీల చిత్రాలను అప్లోడ్ చేసి అటెండెన్స్ వేసుకున్న వందల మంది కార్యదర్శులు అభాసుపాలయ్యారు.
మంత్రి సీతక్క సీరియస్..
వందల సంఖ్యలో నకిలీ హాజరు నమోదవ్వడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించవద్దని సంబంధిత అధికారులను హెచ్చరించారు. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు, ఇప్పటివరకు 553 మంది పంచాయతీ సెక్రెటరీలు ఫేక్ అటెండెన్స్ వేసినట్లు గుర్తించారు.
అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఒక పంచాయతీ కార్యదర్శిని వెంటనే సర్వీస్ నుంచి తొలగించారు. మరో 15 మందిని సస్పెండ్ చేశారు. మిగిలిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా.. సెక్రెటరీల హాజరును పర్యవేక్షించాల్సిన ఎంపీఓలు (మండల పంచాయతీ అధికారులు) కూడా విధుల్లో నిర్లక్ష్యం వహించారని ప్రభుత్వం గుర్తించింది. మొత్తం 47 మంది ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, వారిపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.
నకిలీ అటెండెన్స్ వెనుక కారణం ..
ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యం, సేవలు అందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శులను నియమించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపు 9 వేలకు పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించగా.. అందులో చాలా మంది రెగ్యులర్ అయ్యారు. అయితే.. చాలా మంది కార్యదర్శులు తమ గ్రామాల్లో అందుబాటులో ఉండట్లేదని ఫిర్యాదులు రావడంతో.. వారి హాజరును పారదర్శకంగా పర్యవేక్షించడానికి ఫేస్ రికగ్నిషన్ యాప్ను ప్రవేశపెట్టారు. కానీ.. కొందరు కార్యదర్శులు ఈ సాంకేతికతను కూడా తమ నిర్లక్ష్యానికి అనువుగా మార్చుకున్నారు. తాజాగా వీరి హాజరుపై ఫిర్యాదులు అందడంతో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా, ఈ ఫేక్ అటెండెన్స్ వ్యవహారం బయటపడింది.
అత్యధికంగా నకిలీ హాజరు నమోదు చేసిన జిల్లాల వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలో 70 మంది, నల్గొండ జిల్లాలో 69 మంది, వికారాబాద్ జిల్లాలో 63 మంది, సూర్యాపేట జిల్లాలో 48 మంది, కామారెడ్డి జిల్లాలో 43 మంది, కొత్తగూడెం జిల్లాలో 42 మంది ఉన్నారు. సస్పెండ్ అయిన కార్యదర్శులు ఎక్కువగా వనపర్తి జిల్లాలో ఉండగా.. ఏడుగురు కార్యదర్శులు సస్పెండ్ అయ్యారు. నిర్లక్ష్యం వహించిన ఎంపీఓలు ఎక్కువ ఉన్న జిల్లాల విషయానికి వస్తే.. సరైన పర్యవేక్షణ చేయని ఎంపీఓలలో కొత్తగూడెంలో 17 మంది, నల్గొండ జిల్లాలో 15 మంది ఉన్నారు. ఆశ్చర్యకరంగా.. అత్యధికంగా ఫేక్ అటెండెన్స్ నమోదైన సిద్దిపేట జిల్లాలో మాత్రం కేవలం ఒక ఎంపీవోది మాత్రమే నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ చర్యల ద్వారా పంచాయతీ వ్యవస్థలో క్రమశిక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa