తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక రైతు బీమా పథకం 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో రైతులు ఈ పథకంలో చేరడం విశేషం. మొత్తం 42,16,848 మంది రైతులకు ప్రభుత్వం బీమా కవరేజీని కల్పించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి అదనంగా 1,181 మందిని చేర్చారు. జూన్ 5, 2025 వరకు కొత్తగా పట్టాదారు పాస్బుక్లు పొందిన 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల రైతులు ఈ పథకానికి అర్హులని అధికారులు తెలిపారు.
కొత్తగా చేరిన రైతులు, ప్రీమియం తగ్గింపు..
రైతు బీమా కొత్త సీజన్ ఆగస్టు 14 నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 13 వరకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు 1,96,890 మంది కొత్త రైతులకు బీమా సౌకర్యం కల్పించారు. గతంలో బీమా ఉన్న 40,19,958 మంది రైతుల బీమాను రెన్యువల్ చేశారు. దీంతో మొత్తం 42.16 లక్షల మంది రైతులకు 2026 ఆగస్టు 14 వరకు బీమా రక్షణ కొనసాగుతుంది. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారుల కృషి వల్ల ఈ ఏడాది బీమా ప్రీమియం గతంలో కంటే తగ్గింది. గతంలో రూ.3,400 ఉన్న ప్రీమియం ఇప్పుడు రూ.3,225కి తగ్గించబడింది. 2024-25 బీమా సంవత్సరంలో 25 వేలకు పైగా క్లెయిమ్లు నమోదయ్యాయి. దీని ద్వారా ఒక్కో క్లెయిమ్కు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.1,300 కోట్లకు పైగా పరిహారం రైతు కుటుంబాలకు అందింది.
రైతు బీమా లబ్ధిదారుల సంఖ్యలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో అత్యధికంగా 2,98,037 మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించారు. కొత్తగా 12,212 మంది రైతులు చేరగా, 2,85,825 మందికి రెన్యువల్ చేశారు. తరువాత సంగారెడ్డి జిల్లాలో 2,12,335 మందికి, ఖమ్మం జిల్లాలో 2,04,951 మందికి బీమా అవకాశం దక్కడంతో అవి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలలో కూడా అధిక సంఖ్యలో రైతులు ఈ పథకం కింద నమోదయ్యారు. అయితే.. మేడ్చల్ జిల్లాలో మాత్రం అత్యల్పంగా 14,310 మంది రైతులు మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ఈ పథకం ద్వారా రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించడమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa