వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వానలు పడతాయని, ఈ నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి సహా పది జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన, పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని వెంటనే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.హైదరాబాద్ నగరంలో హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, పోలీసు బృందాలు నిరంతరం అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల వేళ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందికి సూచించారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు వంతెనల వద్ద ప్రవాహం ఎక్కువగా ఉంటే రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని చెప్పారు.చెరువులు, కుంటలకు గండ్లు పడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖకు దిశానిర్దేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa