ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్ స్క్రీన్ షేర్ చేస్తున్నారా..? అయితే తెలంగాణ పోలీసుల హెచ్చరిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 07:28 PM

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఏది కావాలన్నా.. ఏది ఇవ్వాలన్నా అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతోంది. ఒకప్పుడు డబ్బులను డిపాజిట్ చేయాలంటే బ్యాంక్ వద్ద భారీ క్యూలైన్‌లో నిలబడి డిపాజిట్ చేసేవాళ్లం. ప్రస్తుతం అంతా డిజిటల్ కావడంతో యూపీఏ ద్వారా క్షణాల్లో డబ్బులను అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. ఇలా పూర్తిగా ప్రతీ విషయానికి డిజిటల్ మీదనే ఆధారపడుతున్నాం. ఈ విధంగా స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్, ఆన్‌లైన్‌ యాప్స్ మన జీవితంలో భాగమైపోయాయి. వీటితో సౌకర్యాలు పెరిగినా.. అదే సమయంలో సైబర్ నేరాలు కూడా విస్తరించి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒక చిన్న నిర్లక్ష్యం వల్లే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి.


ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్న మోసం వాట్సాప్ స్క్రీన్ షేర్ ట్రిక్. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ప్రతినిధులుగా నటిస్తూ అకౌంట్ బ్లాక్ అవుతుందని భయపెడతారు. వీడియో కాల్‌లో స్క్రీన్ షేర్ చేయమని ఒత్తిడి చేస్తారు. ఒకసారి అలా చేస్తే మీ ఫోన్‌లోని ఫోటోలు, యాప్‌లు, పాస్‌వర్డ్‌లు అన్నీ వారి చేతిలో పడతాయి. తర్వాత ఒక్కసారిగా మీ ఖాతా ఖాళీ అవుతుంది.


ఇంకో కొత్త పద్ధతి ఫిషింగ్ లింక్ స్కామ్. ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ద్వారా ‘మీ కేవైసీ అప్‌డేట్ చేయండి’ అంటూ లింక్ పంపిస్తారు. దానిపై క్లిక్ చేస్తే మీ మొబైల్‌లోని అన్ని వివరాలు హ్యాకర్‌కి చేరతాయి. ఈ లింక్‌ల ద్వారా మాల్వేర్ ఇన్‌స్టాల్ అవ్వడంతో డివైజ్ పూర్తిగా వారి నియంత్రణలోకి వెళ్తుంది.


OLX స్కామ్ కూడా ఇటీవల పెరిగింది. అమ్మకానికి ఉంచిన వస్తువులపై కొనుగోలుదారులుగా నటిస్తూ ముందుగా చిన్న మొత్తం గూగుల్ పే లేదా ఫోన్ పేలో ట్రై ట్రాన్సాక్షన్ చేస్తారు. వెంటనే "మేము పెద్ద మొత్తం పంపుతున్నాం, ఓటీపీ చెప్పండి" అంటారు. అమాయకులు ఓటీపీ చెప్పగానే వారి ఖాతా నుంచి మొత్తం డబ్బు ఎగిరిపోతుంది. అలాగే డిజిటల్ అరెస్ట్ ట్రాప్ పేరిట నకిలీ పోలీసులుగా నటించే గుంపులు కూడా కనిపిస్తున్నాయి. వీడియో కాల్‌లో పోలీస్ యూనిఫాం వేసుకున్నట్టుగా చూపించి, మీపై కేసు నమోదైందని చెబుతూ స్క్రీన్ షేర్ చేయిస్తారు. భయంతో కొందరు తమ బ్యాంకింగ్ వివరాలు ఇచ్చేసి మోసపోతున్నారు.


అయితే వీటిని నివారించేందుకు తెలంగాణ పోలీసులు సోషల్ మీడియా వేదిక ద్వారా పలు సూచనలు ఇస్తున్నారు. అందులో.. ఏ అపరిచితులూ స్క్రీన్ షేర్ కోరినా అంగీకరించకూడదు. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకూడదు. OLX, Quikr వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో కొనుగోలు/అమ్మకాలు చేసే సమయంలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు. బ్యాంక్ ఎప్పటికీ ఓటీపీ అడగదు, అని గుర్తుంచుకోవాలి. ఎవరైనా మోసం చేశారని అనుమానం వచ్చిన వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930 లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చని హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa